ఉదయమే భారీ షాక్:
ఓవర్నైట్ స్కోర్ 36/3తో మూడో రోజు బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ భారత పేసర్ల ధాటికి క్రీజులో నిలవలేకపోయారు. మొదటగా షమీ వేసిన 18వ ఓవర్లో నోర్జె (3) స్లిప్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఇక ఉమేశ్ యాదవ్ వేసిన 21వ ఓవర్లో డిబ్రుయిన్ (30) కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో మూడో రోజు ఉదయమే సఫారీ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
కెప్టెన్ ఇన్నింగ్స్:
53 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును డుప్లెసిస్, డికాక్లు ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్కు 75 పరుగుల భాగస్వామ్యం జోడించారు. క్రీజులో కుదురుకున్న డికాక్ (31; 48 బంతుల్లో 7x4)ను అశ్విన్ బౌల్డ్ చేసి భారత్కు ఊరటనిచ్చాడు. భోజన విరామ సమయానికి దక్షిణాఫ్రికా జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.
ఆదుకున్న మహారాజ్:
లంచ్ విరామం అనంతరం సేనురాన్ ముత్తుసామి (7)ని జడేజా వెనక్కి పంపాడు. అర్ధ సెంచరీ చేసిన డుప్లెసిస్ (64) కూడా పెవిలియన్ చేరడంతో సఫారీల పని అయిపోయిందనుకున్నారు. కానీ.. ఫిలాండర్, కేశవ్ మహారాజ్ జట్టును ఆదుకున్నారు. దాదాపుగా రెండు సెషన్ల పాటు క్రీజులో నిలబడి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ జోడి ఆచితూచి ఆడుతూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ 100పైగా పరుగుల భాగస్వామ్యంను నెలకొల్పారు.
దక్షిణాఫ్రికా ఆలౌట్:
ఈ జోడీని విడదీయడానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలర్లను ఎందరిని మార్చినా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా మహారాజ్ 132 బంతులు ఎదుర్కొని అర్ధ సెంచరీతో దక్షిణాఫ్రికా జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఆట చివరలో అశ్విన్ రెచ్చిపోవడంతో.. కేశవ్ మహరాజ్ పోరాటం ముగిసింది. అనంతరం కొద్దీ సేపటికే దక్షిణాఫ్రికా ఆలౌట్ అయింది. రెండో రోజే దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో ఉమేష్ 3, అశ్విన్ 4 వికెట్లు తీశారు.