|
రవిశాస్త్రి పర్యవేక్షణలో నెట్ ప్రాక్టీస్:
కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, యువ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్ ఆదివారమే విశాఖ చేరుకున్నారు. కోహ్లీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. గత వారమే దక్షిణాఫ్రికా జట్టు విశాఖకు చేరుకుని సన్నాహక మ్యాచ్ ఆడారు. ఆదివారం రెస్ట్ తీసుకున్న ఆటగాళ్లు సోమవారం నెట్ ప్రాక్టీస్లో పాల్గొన్నారు. హెడ్కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో పేసర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. రవిశాస్త్రి దగ్గరుండి మరి వీరి బౌలింగ్ను గమనించాడు. స్పిన్నర్ అశ్విన్ కూడా బౌలింగ్ చేసాడు.
|
కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్:
మరోవైపు విరాట్ కోహ్లీ, అంజిక్య రహానే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్కు ముందు హెడ్కోచ్ రవిశాస్త్రి ఆటగాళ్ల అందరితో సమావేశం అయ్యాడు. మరోవైపు సౌతాఫ్రికా క్రికెటర్లు సైతం బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఓపెనర్గా రోహిత్:
అక్టోబర్ 2 నుండి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. పరిమిత ఓవర్ల ఓపెనర్ 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ ఈ సిరీస్లో ఓపెనర్గా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి అతనిపైనే ఉంది. రాహుల్ స్థానంలో టెస్ట్ ఫార్మాట్లో స్థానం దక్కించుకున్న రోహిత్.. మయాంక్ అగర్వాల్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంబించనున్నాడు.
246 పరుగుల తేడాతో విజయం:
ఇంతకుముందు విశాఖలో ఒక టెస్టు మ్యాచ్ జరిగింది. 2016-17 సీజన్లో కోహ్లీ సారథ్యంలోని టీమిండియా.. ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో టీమిండియా 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కోహ్లీ సెంచరీ(167) చేయగా.. రెండో ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీ (81) చేశాడు. ఇక్కడ కోహ్లీకి ఘనమైన రికార్డు ఉండడంతో పరుగుల వరద పారే అవకాశం ఉంది.