కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న చివరి టీట్వంటీ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొత్తం మూడు మ్యాచ్ల టీట్వంటీ సిరీస్లో భారత్ ఇప్పటికే తొలి రెండు టీట్వంటీ మ్యాచ్లు గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మ్యాచ్ను కూడా టీమిండియా సీరియస్గా తీసుకుని ఎలాగైనా సరే గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.
ఇదిలా ఉంటే టీమిండియాలో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. రెండో టీట్వంటీకి స్టాండ్స్కే పరిమితమైన స్పిన్నర్ చాహల్ తిరిగి జట్టులో చేరగా అశ్విన్కు విశ్రాంతినిచ్చారు. కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ వచ్చాడు. ఇక టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కొంత స్టిక్కీగా ఉందని చెప్పాడు. అయితే మంచి బ్యాటింగ్ జట్టుగా ఈ చివరి మ్యాచ్లో తమకు తాము సవాల్ విసురుకోవాలని భావిస్తున్నట్లు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇలాంటి పిచ్ పై ఆడి విజయం సాధించడం సవాలుతో కూడుకున్న పనే అని రోహిత్ వ్యాఖ్యానించాడు.
మరోవైపు టాస్ గెలిచినా తాము బౌలింగ్ చేసేవారమని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తెలిపాడు. గత మ్యాచ్లపై మంచు ప్రభావం ఉన్నిందని చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ సమిష్టిగా రాణించి చివరి టీట్వంటీలో విజయం సాధిస్తామనే ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆరంభం బాగానే ఉన్నా మిడిల్ ఆర్డర్ విఫలమవడంతో ఆశించినంత స్థాయిలో స్కోరు చేయలేకపోతున్నామని అన్నాడు. అయితే భారత ఓపెనర్లు బరిలోకి దిగి మంచి భాగస్వామ్యం నెలకొల్పుతూ ఆ తర్వాత వచ్చేవారికి సులభతరం చేస్తున్నారని ప్రశంసించాడు.అయితే ఈరోజు జరిగే మ్యాచ్లో తప్పక గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేశాడు శాంట్నర్.