న్యూజిలాండ్ 140/5
ఓపెనర్లతో సహా సీనియర్ బ్యాటర్ విఫలమైనా సరే కొత్త ఆటగాళ్లు ఎదురొడ్డి మరీ జట్టు కుప్పకూలకుండా కాపాడారు. నాలుగో రోజుకు ఆటను తీసుకుపోగలిగారు. 540 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. క్రీజ్లో హెన్రీ నికోల్స్ (36 బ్యాటింగ్), రచిన్ రవీంద్ర (2 బ్యాటింగ్) ఉన్నారు. న్యూజిలాండ్ కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్ (6), రాస్ టేలర్ (6), టామ్ బ్లండెల్ (0) మరోసారి విఫలమయ్యారు. విల్ యంగ్ (20) కాస్త ఫర్వాలేదనిపించినా ఎక్కువ సేపు క్రీజ్లో నిలబడలేదు. ఈ మూడు వికెట్లను అశ్విన్ (3/26) తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆదుకున్న డారిల్ మిచెల్..
మరోసారి మొదటి ఇన్నింగ్స్ మాదిరిగానే కుప్పకూలుతుందని కంగారు పడిన న్యూజిలాండ్ను డారిల్ మిచెల్ (60) హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. నికోల్స్తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేసి ధాటిగా ఆడిన మిచెల్ను అక్షర్ పటేల్ (1/40) బోల్తా కొట్టించాడు. చివరి రెండు రోజుల్లో కివీస్ గెలవాలంటే 400 పరుగులు చేయాల్సి ఉండగా.. ఐదు వికెట్లు తీస్తే విజయంతోపాటు సిరీస్ టీమిండియా వశమవుతుంది.
మళ్లీ దెబ్బకొట్టిన ఆజాజ్
న్యూజిలాండ్కు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన టీమిండియా 276/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (62), పుజారా (47), శుభ్మన్ గిల్ (47), అక్షర్ పటేల్ (41 నాటౌట్), విరాట్ కోహ్లీ (36) రాణించారు. శ్రేయస్ అయ్యర్( 14), వృద్ధిమాన్ సాహా (13), జయంత్ యాదవ్ (6) పరుగులు చేశారు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి భారత్ కోల్పోయిన పదిహేడు వికెట్లను కివీస్ స్పిన్నర్లే తీయడం విశేషం. సెకండ్ ఇన్నింగ్స్లోనూ అజాజ్ పటేల్ (4/106), రచిన్ రవీంద్ర (3/56) ఉత్తమ ప్రదర్శన చేశారు. కివీస్ తరఫున ఒకే టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అజాజ్ మరో రికార్డు సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్లో అతను 10 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.
|
సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 345/10, రెండో ఇన్నింగ్స్: 276/7 (డిక్లేర్డ్)
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్: 62/10