డ్రాగా తొలి టెస్ట్..
కాగా- ఉత్తర ప్రదేశ్ కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. చివరి రోజు చివరి ఓవర్.. చివరి వికెట్ వరకూ సాగిందీ మ్యాచ్. ఒక్క వికెట్ పడి ఉంటే ఆ మ్యాచ్ భారత్ ఖాతాలో పడి ఉండేది. చివరి రోజు టీమిండియా బౌలర్లు తొమ్మిది ఓవర్లు సంధించినప్పటికీ.. చివరి వికెట్ను తీసుకోలేకపోయారు. న్యూజిలాండ్ టెయిలెండర్ బ్యాటర్లు టెయిలెండర్లు రచిన్ రవీంద్ర, ఎజాజ్ పటేల్ వికెట్ పడకుండా ఆడారు. అసమాన పోరాట పటిమను ప్రదర్శించారు. మ్యాచ్ను డ్రాగా ముగించేయగలిగారు.
వాంఖెడె స్టేడియంలో రెండో టెస్ట్
రెండో టెస్ట్ మ్యాచ్కు ముంబై వాంఖెడె స్టేడియం వేదికగా మారింది. శుక్రవారం ఉదయం మ్యాచ్ ఆరంభమౌతుంది. ఉదయం 9 గంటలకు టాస్ పడుతుంది. 9:30 నిమిషాలకు మ్యాచ్ మొదలవుతుంది.. వర్షం పడకుంటే. ఈ పిచ్ మీద విరాట్ కోహ్లీకి మంచి గ్రిప్ ఉంది. ఈ స్టేడియంలోనే అతను టెస్టుల్లో డబుల్ సెంచరీ చేశాడు. 235 పరుగులు సాధించాడు. వ్యక్తిగతంగా ఈ స్టేడియంలో ఇది రెండో అత్యుత్తమ బెస్ట్ స్కోర్. క్లైవ్ లాయిడ్ చేసిన 242 పరుగులే ఇప్పటికీ వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్గా కొనసాగుతోందీ పిచ్పై.
వృద్ధిమాన్ సాహ ఫిట్..
రెండో టెస్ట్ మ్యాచ్ కోసం వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహ పూర్తి ఫిట్నెస్ను సాధించాడు. అతను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. కివీస్ను ఢీ కొట్టబోయే టీమిండియా తుది జట్టులో అతనికి చోటు దక్కుతుందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించలేదు. తొలి టెస్ట్ మ్యాచ్లో అందుబాటులో లేని విరాట్ కోహ్లీ.. ఇప్పుడు జట్టుతో చేరాడు. వాంఖెడె టెస్ట్ మ్యాచ్ను ఆడనున్నాడు. అతని చేరికతో ఎవరిపై వేటు వేయాలనేది తేల్చుకోలేకపోతోంది జట్టు మేనేజ్మెంట్. టెస్టుల్లో విఫలమౌతోన్న అజింక్య రహానెను తప్పించాలనే నిర్ణయానికి దాదాపుగా వచ్చినట్టే.
తుదిజట్టు కూర్పు..
అదే పరిస్థితుల్లో సాహ కూడా ఫిట్నెస్ను సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాన్పూర్ టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్లో అతను విఫలమైనప్పటికీ.. రెండో ఇన్నింగ్లో నిలదొక్కుకోగలిగాడు. 61 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. తన ప్రత్యర్థికి భారత జట్టు భారీ స్కోర్ను లక్ష్యంగా నిర్దేశించడానికి బాటలు వేశాడు. రెండో ఇన్నింగ్లో వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో క్రీజ్లోకి ఎంట్రీ ఇచ్చిన సాహ తుది వరకూ నిలిచాడు. అతను జోడించిన 61 పరుగులు చాలా విలువైనవిగా పరిగణించవచ్చు.
సాహను తీసుకుంటే..
వృద్ధిమాన్ సాహను జట్టులోకి తీసుకుంటే.. మరొకరిని తప్పించాల్సి ఉంటుంది. విరాట్ కోహ్లీ రాకతో అజింక్య రహానెను పక్కన పెట్టాలని భావించినా.. ఇప్పుడు సాహ కూడా తోడు కావడంతో ఇద్దరిని బెంచ్కే పరిమితం చేయ్యాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది టీమ్ మేనేజ్మెంట్. సాహను తుది జట్టులోకి తీసుకుంటే.. ఓపెనర్ మయాంక్ అగర్వాల్కు చోటు దక్కకపోవచ్చనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. శుభ్మన్ గిల్తో పాటు వృద్ధిమాన్ సాహను ఓపెనర్గా పంపించినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. సాహ స్థానంలో సబ్స్టిట్యూట్గా కీపింగ్ చేసిన కేఎస్ భరత్ పేరును కూడా పరిశీలనలో ఉంది.
తుదిజట్టు ఇలా ఉండొచ్చు..
శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్/అజింక్యా రహానే, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కేప్టెన్), కేఎస్ భరత్/వృద్దిమాన్ సాహ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ/మహమ్మద్ సిరాజ్.