ఆక్లాండ్: ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ లోకేష్ రాహుల్ (57) హాఫ్ సెంచరీ చేయగా.. యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (44) మరోసారి రాణించాడు. కివీస్ బౌలర్లలలో టీమ్ సౌతీ రెండు వికెట్లు సాధించాడు. హాప్ సెంచరీ చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన రాహుల్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్పై భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.
హిందీ నేర్చుకోవడం కోసం ఎంతో కష్టపడ్డా.. మా పిల్లలతో ట్యూషన్కు వెళ్లా: లక్ష్మణ్
మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారత బౌలర్లపై ప్రశంసలు కురిపించాడు. 'ఇది కఠినమైన రోజు. తొలి మ్యాచ్తో పోలిస్తే ఈ రోజు పిచ్ విభిన్నంగా ఉంది. మరో 15-20 పరుగులు చేసుంటే బాగుండేది. మా ఓపెనర్ బ్యాట్స్మన్లు మంచి ఆరంభమే ఇచ్చారు. దానిని మేం కొనసాగించలేకపోయాం. నాతో పాటు అందరం విఫలమయ్యాం. చిన్న మైదానంలో 132 పరుగులే చేసినప్పటికీ.. మా బౌలర్లు మంచి శుభారంభాన్నే అందించారు. ఆరంభంలోనే రెండు ప్రధాన వికెట్లు తీశారు. అయితే అదే ఒత్తిడిని టీమిండియాపై కొనసాగించలేకపోయాం.' అని విలియమ్సన్ తెలిపాడు.
'మా స్పిన్నర్లు టీమిండియా బ్యాట్స్మన్పై ప్రభావం చూపలేకపోయారు. అయితే మా స్పిన్నర్లను నిదించడం లేదు. ఎందుకంటే.. స్పిన్ బౌలింగ్లో ఆడటం భారత బ్యాట్స్మెన్కు ఎంతో అనుభవం ఉంది, టాప్ క్లాస్ ప్లేయర్లు జట్టులో ఉన్నారు. బ్యాటింగ్లో మరో 15-20 పరుగులు చేసినా, బౌలర్లు మధ్యలో మరో రెండు వికెట్లు పడగొట్టిన ఫలితం వేరేలా ఉండేది. మా తప్పిదాల గురించి చర్చించుకుంటాం. తర్వాతి మ్యాచ్లలో మెరుగ్గా ఆడేందుకు కృషి చేస్తాం' అని విలియమ్సన్ చెప్పాడు.
'భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పేస్, స్పిన్ బాగుంది. సరైన సమయాలలో వికెట్లు తీస్తూ మాపై ఒత్తిడిపెంచారు. ఈ మ్యాచ్ క్రెడిట్ మొత్తం వాళ్లదే. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా ఆటగాళ్లు ఈ విజయానికి అన్నిరకాల అర్హులే. కఠినమైన ప్రత్యర్థి కాబట్టి మరింత మెరుగ్గా ఆడాల్సి ఉండే. ఏదేమైనా పటిష్ట జట్టుపై మా ఆటను పరీక్షించుకుంటాం' అని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.