India vs England: ఆ ఒక్క కారణంతోనే కుల్దీప్ను తుది జట్టులోకి తీసుకోలేదు: కోహ్లీ

చెన్నై: ఇంగ్లండ్తో చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం ముగిసిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు, ఓ లెఫ్టార్మ్ స్పిన్నర్ను కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్నాడు. సీనియర్ రవిచంద్రన్ అశ్విన్తో పాటు యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ వైపు కోహ్లీ మొగ్గు చూపాడు. ఇక అక్షర్ పటేల్ మోకాలి నొప్పితో చివరి నిమిషంలో జట్టుకు దూరం కాగా.. ఆశ్చర్యకరంగా కేవలం ఒకే టెస్ట్ ఆడిన షాబాజ్ నదీమ్ను తుది జట్టులోకి తీసుకున్నాడు.

నదీమ్ విఫలం:
మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ని తుది జట్టులో టీమిండియా ఆడించకపోవడంపై తొలి రోజు నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక చెపాక్ పిచ్పై షాబాజ్ నదీమ్ అంచనాల్ని అందుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 44 ఓవర్లు వేసిన నదీమ్.. 3.80 ఎకానమీతో 167 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో 15 ఓవర్లు వేసి.. 4.40 ఎకానమీతో 66 పరుగులిచ్చి మరో రెండు వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్లోనూ రెండు ఇన్నింగ్స్ల్లో నదీమ్ డకౌట్ అయ్యాడు. నదీమ్ తొలి టెస్టులో నాలుగు వికెట్లు తీసినా.. భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో కుల్దీప్ విషయమై చర్చలు జరుగుతున్నాయి. కుల్దీప్ ఆడుంటే పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉండేదని పలువురు అంటున్నారు.

బౌలింగ్ విభాగంలో వెరైటీ కోసమే:
కుల్దీప్ యాదవ్ స్థానంలో షాబాజ్ నదీమ్ని తుది జట్టులోకి తీసుకున్నందుకు ఏమైనా చింతిస్తున్నారా? అని ఈరోజు మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీని ఓ విలేకరి ప్రశ్నించాడు. అందుకు కోహ్లీ బదులిస్తూ... 'అలాంటిది ఏమీలేదు. తుది జట్టు ఎంపికపై నేను అస్సలు చింతించలేదు. అశ్విన్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు జట్టులో ఉన్నప్పుడు.. కుల్దీప్ యాదవ్ని జట్టులోకి తీసుకోలేం. ఎందుకంటే కుల్దీప్ కూడా ఆఫ్ స్పిన్నర్ తరహాలోనే బంతుల్ని విసురుతుంటాడు. అందుకే బౌలింగ్ విభాగంలో వెరైటీ కోసమే నదీమ్ని తీసుకున్నాం. జట్టు కాంబినేషన్ గురించి ఆలోచించే సమయంలో చింతనకి స్థానం లేదు' అని తెలిపాడు.

బెంచ్కే పరిమితం:
కుల్దీప్ యాదవ్ 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో చివరిసారిగా సంప్రదాయ క్రికెట్ ఆడాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన నాలుగో టెస్టులో, ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టును హడలెత్తించాడు. డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక అప్పటి నుంచి టీమిండియా టెస్టు స్క్వాడ్లో చోటు దక్కించుకుంటున్న కుల్దీప్.. బెంచ్కే పరిమితం అయ్యాడు. కుల్దీప్ ఇప్పటివరకు భారత్ తరఫున 6 టెస్టులు, 61 వన్డేలు, 45 టీ20లు ఆడాడు. మొత్తగా 168 వికెట్లు పడగొట్టాడు.

ఎక్కువ పరుగులు ఇచ్చారనడం సబబే:
'తొలి ఇన్నింగ్స్లో ఫాస్ట్ బౌలర్లు, అశ్విన్ సమష్టిగా బౌలింగ్ చేశారు. అయితే పరుగుల్ని నియంత్రించి ఒత్తిడి పెంచాల్సింది. పిచ్ మందకొడిగా ఉండి బౌలర్లకు సాయపడకపోవడంతో బ్యాట్స్మెన్ సులభంగా స్ట్రైక్ రొటేట్ చేశారు. వాషింగ్టన్, నదీమ్ ఎక్కువ పరుగులు ఇచ్చారనడం సబబే. ప్రణాళికల అమల్లో లోపాలు ఆమోదయోగ్యమే కానీ.. వైఖరి సరిగ్గా ఉందా లేదా అన్నదే అత్యంత కీలకం' అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications