
హైదరాబాద్: మైదానంలోకి పావురం రావడంతోనే తాను వికెట్ చేజార్చుకున్నట్లు వస్తున్న వార్తలపై ఇంగ్లాండ్ ఓపెనర్ జెన్నింగ్స్ స్పందించాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా టీమిండియాతో బుధవారం ఆరంభమైన తొలి టెస్టులో 35 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి వికెట్ నష్టానికి 98 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది.
అప్పుడు క్రీజులో జెన్నింగ్స్, జో రూట్ బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. 36వ ఓవర్ వేసేందుకు మహమ్మద్ షమీ బంతిని అందుకున్నాడు. బాల్ వేసేందుకు సిద్ధమవుతుండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పావురం పిచ్పై వాలింది. దానిని వెళ్లగొట్టినా కదలకపోవడంతో కాసేపు మ్యాచ్ నిలిచిపోయింది.
ఆ తర్వాత జెన్నింగ్స్, జో రూట్ సంయుక్తంగా పావురాన్ని మైదానం నుంచి వెలుపలికి తరిమేసేందుకు విఫలయత్నం చేశారు. కానీ.. కాసేపు ఎగురుతూ ఆటకి అంతరాయం కలిగించిన పావురం ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయింది. పావురం వెళ్లిపోవడంతో అంపైర్లు తిరిగి ఆటను కొనసాగించారు.
ఆటకు కాస్తా విరామం దొరకడంతో ఈలోపు బంతిని ఎలా సంధించాలన్నదానిపై షమీ వ్యూహం రచించాడు. మరోవైపు జెన్నింగ్స్ ఆటపై ఏకాగ్రత కోల్పోయాడు. దీంతో తొలి బంతికే జెన్నింగ్స్ పేలవ రీతిలో ఔటయ్యాడు. పావురం కారణంగానే జెన్నింగ్స్ ఏకాగ్రత కోల్పోయినట్లు వార్తలొచ్చాయి.
దీనిపై మ్యాచ్ అనంతరం జెన్నింగ్స్ మాట్లాడుతూ "గొప్ప ఆటగాళ్లకి అలా ఆట మధ్య విశ్రాంతి లభిస్తే.. తమకి అనుకూలంగా మార్చుకుంటారు. ఇక్కడ నేను స్వీయ తప్పిదంతోనే ఔటయ్యా. బంతిని అంచనా వేయడంలో తడబడి వికెట్ చేజార్చుకున్నా. అంతే తప్ప పావురం కారణంగా ఏకాగ్రత చెదిరి కాదు" అని జెన్నింగ్స్ వెల్లడించాడు.
ఇదిలా ఉంటే, ఆతిథ్య ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 287 పరుగులకే ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 285/9తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో రెండు పరుగులు మాత్రమే జోడించి చివరి వికెట్ కోల్పోయింది. రెండో రోజు ఆట ప్రారంభం కాగానే షమీ మరోమారు నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు.
షమీ బంతిని ఎదుర్కొనే క్రమంలో శామ్ కర్రన్(24).. కార్తీక్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు తీయగా, షమీ 3, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.