
హైదరాబాద్: ఎడ్జ్బాస్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో అనుచితంగా ప్రవర్తించిన ప్రదర్శించిన టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మకు ఐసీసీ జరిమానా విధించింది. తొలి టెస్టులో మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ డేవిడ్ మలన్ను ఔట్ చేసిన సమయంలో ఇషాంత్ శర్మ హద్దు దాటి సంబరాలు చేసుకున్నాడు.
దీంతో ఇషాంత్ అత్యుత్సాహాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ అతనికి శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1ను అతడు ఉల్లంఘించినందుకు అతనికి ఒక డీమెరిట్ పాయింట్, మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించింది. శుక్రవారం తొలి సెషన్లో డేవిడ్ మలన్ ఔటైన అనంతరం ఇషాంత్ దురుసుగా ప్రవర్తించాడని అభియోగం నమోదైంది.
మ్యాచ్ అనంతరం ఇషాంత్ను మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రౌ వివరణ కోరగా తాను తప్పు చేశానని, తనకు విధించిన జరిమానాను స్వీకరిస్తున్నట్లు అంగీకరించాడు. మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉంటానని ఇషాంత్ పేర్కొన్నాడు. ఐసీసీ ప్రవర్తనా నియామావళి ప్రకారం.. ఎవరైనా క్రికెటర్ ఔటైన తర్వాత ప్రత్యర్థి జట్టు ఆటగాడు మాటలతో కానీ, లేక చేతలతో కానీ (సంజ్ఞలు) వెటకారం చేయకూడదు.
ఇలా చేస్తే ఐసీసీ రూల్స్ ప్రకారం ఆర్టికల్ 2.1.7 ను అనుసరించి ఆటగాడికి గరిష్టంగా 50శాతం ఫీజులో కోతతో పాటు 1 లేక 2 డీమెరిట్ పాయింట్లు కేటాయిస్తారు. దీంతో మూడో రోజు తొలి సెషన్లో డేవిడ్ మలన్ వికెట్ తీసిన తర్వాత ఇషాంత్ సంబరాలు బ్యాట్స్మెన్ను రెచ్చగొట్టేలా ఉందని మ్యాచ్ అధికారులు గుర్తించారని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇదిలా ఉంటే, తొలి టెస్టులో టీమిండియా 162 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో అనూహ్య విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.