హైదరాబాద్: భారత జట్టుపై సిరీస్ విజయం యాషెస్లో ఆస్ట్రేలియాపై గెలుపుతో సమానమని ఇంగ్లాండ్ కోచ్ ట్రేవర్ బేలిస్ అన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు శుక్రవారం నుంచి ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ "భారత్పై గెలవడం యాషెస్లో ఆస్ట్రేలియాను ఓడించడం లాంటిది. టీమిండియా చాలా అద్భుతమైన జట్టు. ప్రపంచంలో నంబర్వన్. వారిని ఓడించడం ఓ గొప్ప అనుభూతి" అని బేలిస్ అన్నాడు.
ఆఖరి టెస్టులో కొన్ని ప్రయోగాలు చేయబోతున్నట్టు కూడా కోచ్ బేలిస్ తెలిపాడు. "నాలుగో టెస్టులో కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. అలాంటి స్థితిలో ఆటగాళ్లు గొప్ప పట్టుదల ప్రదర్శించారు. జట్టు ముందుకెళ్లడానికి ఇదెంతో మంచిది" అని బేలిస్ అన్నాడు.
ఐదో టెస్టు అనంతరం అలెస్టర్ కుక్ రిటైర్మెంట్, నాలుగో స్థానంలో రూట్ ఆడేందుకు ఇష్టపడుతున్న తరుణంలో శ్రీలంక, వెస్టిండీస్ సిరిస్లలోనూ టాపార్డర్ కుదురుకునేలా ఆఖరి టెస్టులో ప్రయోగాలు ఉంటాయని చెప్పాడు. ఈ వారంలో నే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుల గురించి చర్చిస్తామని తెలిపాడు.
"ప్రతి తరంలో, సిరీస్లోనూ ఏ స్థానాల్లోనైనా ఆడగల ఆటగాళ్లను గుర్తించడం చాలా అవసరం. రూట్కు నాలుగో స్థానంలో ఆడటం ఇష్టం. జట్టు అవసరం దృష్ట్యా అతడు మూడో స్థానంలో ఆడటం బాగుంటుంది. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ సిరీస్లో అద్భుతంగా రాణించారు. వారి శరీరాలు ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టి తర్వాతి సిరీస్లకు ఎంపిక చేస్తాం" అని బేలిస్ తెలిపాడు.