అహ్మదాబాద్: మరికాసేపట్లో ప్రారంభం కానున్న డే/నైట్ టెస్టులో భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్కు తుది జట్టులో చోటు దక్కదని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆడుతాడని చెప్పాడు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో గులాబీ బంతితో డే/నైట్ మ్యాచ్ ఆడేందుకు భారత్, ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. భారత్లోని ఇతర పిచ్లతో పోల్చుకుంటే పచ్చిక ఎక్కువ కనిపిస్తున్న ఈ వికెట్పై భారత జట్టు ముగ్గురు పేసర్లతో బరిలో దిగే అవకాశాలున్నాయి.
తాజాగా గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'మూడో టెస్ట్ భారత్ తుది జట్టులో ఉమేశ్ యాదవ్కు చోటు దక్కుతుందని నేను భావించట్లేదు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని కోహ్లీసేన భావిస్తే ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్ ఉంటారు. సిరాజ్ బాగా ఆకట్టుకుంటున్నాడు. ఆస్ట్రేలియాలో, చెన్నైలో జరిగిన రెండో టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సిరాజ్ బంతిని సంధిస్తున్న తీరు, వేగం ప్రశంసనీయం. ఈ ముగ్గురు పింక్ బాల్ టెస్టులో ఉంటారని నేను అనుకుంటున్నా' అని అన్నాడు.
నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరగనున్న చివరి రెండు టెస్టుల్లో తలపడే భారత జట్టులో ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ను చేర్చారు. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ టెస్టు సందర్భంగా గాయపడిన ఉమేశ్కు ఆదివారం ఫిట్నెస్ పరీక్ష నిర్వహించారు. అందులో ఉమేష్ పాస్ అయ్యాడు. మొతేరా పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉన్నా.. పింక్ బాల్ కావడంతో సంధ్యా సమయం, మంచు ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని తుది జట్టును ఖరారు చేయాలని భారత జట్టు మేనేజ్మెంట్ యోచిస్తోంది.
మొతేరా స్టేడియంలో జరుగనున్న మూడో టెస్ట్ వరల్డ్ చాంపియన్షిప్ ఫైనల్ కోణంలోంచి చూస్తే.. టీమిండియాకు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ లైనప్ను టీమిండియా యథాతథంగా కొనసాగించనుండగా.. బౌలింగ్లో మార్పులు చేయనుంది. పేసర్లు ఇషాంత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా ఆడడం లాంఛనమే. ఫిట్నెస్ నిరూపించుకున్న ఉమేష్ యాదవ్, మొహ్మద్ సిరాజ్లలో ఒక్కరికే అవకాశం దక్కనుంది. మరి కోహ్లీ ఎవరికి ఓటేస్తాడో చూడాలి. ఇక కుల్దీప్ యాదవ్ బెంచ్కే పరిమితం కానున్నాడు. స్పిన్ ఆల్రౌండర్లుగా ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్ తుది జట్టులో ఆడడం ఖాయమే.
మొతేరాలో గులాబీ బంతి సమరం.. బరిలోకి బుమ్రా, ఉమేష్! కుల్దీప్కు నిరాశే! తుది జట్లు ఇవే!