తొలి టెస్టులో అశ్విన్ మాయ
అయితే క్రికెట్ విశ్లేషకుల సందేహాల్ని పటాపంచలు చేస్తూ ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో అశ్విన్ మాయ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లోనూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, ఓపెనర్ అలెస్టర్ కుక్ను అశ్వినే ఔట్ చేయడం విశేషం. ఉపఖండంలో మాదిరే బంతిని టర్న్, బౌన్స్ చేస్తూ ఇంగ్లిష్ బ్యాట్స్మెన్కు చుక్కుల చూపించాడు. ఇక, భారత జట్టుపై ఇంగ్లాండ్ స్పిన్నర్ రషీద్ సైతం బాగానే బౌలింగ్ చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో ఉన్న టీమిండియా నాలుగో రోజు వరుసగా వికెట్లను చేజార్చుకుని ఓటమిపాలైంది.
అందరి దృష్టి లార్డ్స్ టెస్టుపైనే
కచ్చితంగా గెలుస్తుందని అనుకున్న మ్యాచ్లో భారత టాపార్డర్ విఫలం కాడవం... ఇంగ్లీషు బౌలర్లు చెలరేగడంతో 31 పరుగుల తేడాతో కోహ్లీసేన ఓడిపోయింది. మ్యాచ్లో స్పిన్నర్ల ప్రదర్శన బట్టి చూస్తే.. అశ్విన్కు తోడు కుల్దీప్నో లేదా జడేజానో తీసుకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి లార్డ్స్ టెస్టుపై పడింది. ఎడ్జ్బాస్టన్లో కంటే కూడా లార్డ్స్ పిచ్ స్పిన్నర్లకు ఎక్కువ సహకరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంగ్లాండ్లో ఉష్ణ్రోగ్రతలు అధిక స్థాయిలో ఉన్నాయి. లండన్లో వేడి గాలులతో లార్డ్స్ పిచ్, ఔట్ఫీల్డ్ పొడిబారినట్లు కనిపిస్తున్నాయి.
లార్డ్స్లో చివరగా ఎప్పుడో 1976లో ఈ స్థాయి ఉష్ణ్రోగ్రత
ప్రస్తుతం లండన్లో ఉష్ణ్రోగ్రత దాదాపు 35 డిగ్రీల దాకా ఉంటోంది. ఇంగ్లాండ్లో సగటు ఉష్ణ్రోగ్రత కంటే ఇది చాలా ఎక్కువ. లార్డ్స్లో చివరగా ఎప్పుడో 1976లో ఈ స్థాయి ఉష్ణ్రోగ్రత నమోదైందట. ఈ నేపథ్యంలో పిచ్పై పచ్చిక ఉంచినా.. స్పిన్నర్లకు బాగానే అవకాశాలుంటాయని మైదాన వర్గాలు చెబుతున్నాయి. గాలిలో తేమ లేని నేపథ్యంలో బంతి పెద్దగా స్వింగ్ కాదని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాసం ఉందని తెలుస్తోంది. తొలి టెస్టు ఓటమితో లార్డ్స్ టెస్టుని కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండో టెస్టు కోసం టీమిండియా లార్డ్స్కు చేరుకుంది.
లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేసిన టీమిండియా
ఇందులో భాగంగా మంగళవారం భారత ఆటగాళ్లు లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేశారు. ఆటగాళ్లందరూ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రాక్టీస్ చేశారు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి లార్డ్స్ పిచ్ను పరిశీలించాడు. పిచ్ గురించి క్యూరేటర్ను అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్నాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో కనిపించడంతో రెండో టెస్టులో అతడికి చోటు దక్కుతుందేమోనని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మైదానంలో ఇప్పటి వరకు 17 టెస్టులాడిన టీమిండియా కేవలం రెండింట్లో మాత్రమే విజయాలను నమోదు చేసింది. మరోవైపు 11 టెస్టుల్లో ఓటమి పాలుకాగా, నాలుగు టెస్టులను డ్రాగా ముగించింది.