
అహ్మదాబాద్: గుజరాత్లోని కొత్త మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగిన డేనైట్ టెస్ట్ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోపే ముగిసిన విషయం తెలిసిందే. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ (6/38, 5/32) విజృంభించడంతో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కోహ్లీ సేన టెస్ట్ సిరీస్లో ఆధిక్యం సాధించిందన్న ఆనందమే ఉన్నా.. మ్యాచ్ మరీ రెండు రోజుల్లోపే ముగియడం పట్ల మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫాన్స్ కూడా అసహనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మ్యాచ్ జరగాల్సిన 3,4, 5వ తేదీలకు సంబంధించిన టికెట్లు ఎప్పుడో అమ్ముడుపోయాయి. అయితే మ్యాచ్ మాత్రం రెండు రోజుల్లోనే ముగిసింది. మరి మిగిలిన మూడు రోజులకు టికెట్లు కొన్నవారి పరిస్థితి ఏంటని ఇప్పుడు ఓ సమస్యగా మారింది. 'మా టికెట్ డబ్బులు రిఫండ్ ఇస్తారా?' అని కొందరు ఆన్లైన్లో మోడీ అధికారుల్ని నిలదీస్తున్నారు. రిఫండ్ పాలసీ ఏదైనా ఉంటే చెప్పండి అంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. బుక్మై షో ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు.. ఆ ట్విట్టర్ అకౌంట్కు తమ ఫిర్యాదులు పంపుతున్నారు. డబ్బులు వాపస్ ఇవ్వండి లేదా కనీసం వచ్చే మ్యాచ్కు టికెట్ అన్న ఇవ్వండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
ఈ ఓటమితో ఇంగ్లిష్ జట్టు సిరీసులో 1-2తో వెనకబడింది. మార్చి 4 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. నరేంద్ర మోదీ స్టేడియంలోనే చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు గుజరాత్లోనే ఉన్నారు. కరోనా నేపథ్యంలో టెస్ట్ సిరీస్ బయో బబుల్ వాతావరణంలో జరుగుతున్న విషయం తెలిసిందే.
అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభం అయినప్పటినుంచి ఈరోజు వరకు మొత్తం 2412 టెస్టులు జరిగాయి. అందులో 22 మ్యాచ్లు కేవలం రెండు రోజుల్లోనే పూర్తయ్యాయి. క్రికెట్ను ప్రపంచానికి పరిచయం చేసిన ఇంగ్లండ్ అత్యధికంగా 13 సార్లు రెండు రోజుల్లో ముగిసిన మ్యాచ్ల్లో భాగస్వామిగా నిలిచింది. అందులో 9 సార్లు విజయం సాధించగా.. 4 సార్లు ఓటమి చవిచూసింది. ఇక ఆధునిక క్రికెట్లో 2000 తర్వాత మొత్తం ఏడు టెస్టులు రెండు రోజుల్లోనే పూర్తయ్యాయి. ఇంగ్లండ్ రెండుసార్లు తలపడగా ఒకటి విజయం సాధించి, మరొకటి ఓటమిపాలైంది. ఈ ఏడు టెస్టుల్లో జింబాబ్వే అత్యధికంగా మూడు సార్లు పాలుపంచుకుంది. భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు రెండు మ్యాచ్లు ఆడాయి.