
హైదరాబాద్: ఓవల్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో కేఎల్ రాహుల్కి ఐదో సెంచరీ. అంతేకాదు ఈ ఐదు సెంచరీలను ఐదు దేశాల మీద చేయడం విశేషం. 58/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆఖరిరోజు ఆటను ప్రారంభించినప్పటి నుంచి కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడాడు.
ఈ క్రమంలో బెన్ స్టోక్స్ వేసిన 41వ ఓవర్లో ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదిన రాహుల్ 118 బంతుల్లో సెంచరీని సాధించాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 46 పరుగులతో నాటౌట్గా నిలిచిన కేఎల్ రాహుల్ ఐదో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే ఇన్నింగ్స్ 19వ ఓవర్లో అండర్సన్ వేసిన చివరి బంతిని ఎదుర్కొన్న రాహుల్ దానిని ఫోర్గా మలిచి హాఫ్ సెంచరీని సాధించాడు.
ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడి సెంచరీ సాధించాడు. తొలి టెస్టులో మూడో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కేఎల్ రాహుల్ను ఆ తర్వాత టీమిండియా మేనేజ్మెంట్ ఓపెనర్గా ప్రమోట్ చేసింది. అయినప్పటికీ.. రాహుల్ విఫలమవుతూ వచ్చాడు. అయితే, ఆఖరి టెస్టులో సెంచరీతో సత్తాచాటాడు.
దీంతో ఆతిథ్య ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ముగ్గురు భారత ఆటగాళ్లు సెంచరీలు సాధించారు. ఈ సిరిస్లో తొలుత విరాట్ కోహ్లీ సెంచరీ చేయగా, ఆ తర్వాత పుజారా, ఇప్పుడు కేఎల్ రాహుల్ సెంచరీలతో మెరిశారు. దీంతో ముగ్గురు లేదా అంతకుమించి భారత ఆటగాళ్లు సెంచరీలు సాధించిన సిరిస్ల్లో ఈ సిరిస్ మూడో స్థానంలో నిలిచింది.
2002లో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చిన సమయంలో ఐదుగురు బ్యాట్స్మెన్లు(ద్రవిడ్, గంగూలీ, టెండూల్కర్, సెహ్వాగ్, అగార్కర్)లు సెంచరీలు సాధించారు. ఆ తర్వాత 1979లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ముగ్గురు ఆటగాళ్లు (గవాస్కర్, విశ్వనాథ్, వెంగ్ సర్కార్)లు సెంచరీలు సాధించారు.
జట్టు స్కోరు 120 పరుగుల వద్ద రహానే నాలుగో వికెట్గా వెనుదిరిగినప్పటికీ, కేఎల్ రాహుల్ మాత్రం మరింత దూకుడుగా ఆడాడు. స్పిన్నర్లు, పేసర్లు అని తేడా లేకుండా టీ20 తరహాలో అదరగొట్టాడు. దీంతో లంచ్ విరామ సమయానికి 45 ఓవర్లకు గాను భారత్ 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.
క్రీజులో కేఎల్ రాహుల్(108), రిషబ్ పంత్(12) పరుగులతో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్లో 423 పరుగులు చేసిన ఇంగ్లాండ్ భారత్కు 464 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందుంచింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్మెన్లు తడబడ్డారు.
ఓపెనర్ శిఖర్ ధావన్(1), ఛటేశ్వర్ పుజారా(0), విరాట్ కోహ్లీ(0), హానుమ విహారి(0) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో ప్రస్తుతం క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్, రిషబ్ పంత్తో కలిసి జట్టును గట్టెక్కించేందుకు కృషి చేస్తున్నారు.