మార్పుల్లేకుండానే బరిలోకి
కోహ్లీ కెప్టెన్గా వ్యవహిరించిన 38 టెస్టుల్లో భారత్ ఇప్పటివరకు ఆడిన ప్రతి టెస్టులోనూ కనీసం ఒక మార్పుతోనైనా బరిలోకి దిగింది. అయితే, ఈ టెస్టులో గత మ్యాచ్ జట్టుతోనే బరిలోకి దిగనున్నట్లు కోహ్లీ పరోక్షంగా మీడియా సమావేశంలో చెప్పాడు. నాటింగ్హామ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో జట్టులోని ప్రతీ ఆటగాడు తన వంతు బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడంతో మూడో టెస్టులో మార్పులకు అవకాశం కనిపించడం లేదు. అశ్విన్ ఫిట్నెస్పై కోహ్లీ స్పష్టత ఇచ్చాడు. దీంతో నాలుగో టెస్టులో అశ్విన్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.
|
పరిస్థితులను బట్టి రెండో స్పిన్నర్కు అవకాశం
బ్యాటింగ్ వైఫల్యంతోనే తొలి రెండు టెస్టుల్లో పరాజయాలు చవిచూసిన టీమిండియా మూడో టెస్టులో బ్యాట్స్మెన్ సత్తా చాటడంతో విజయం సాధించింది. కోహ్లీ చెలరేగిపోతుండగా రహానే, పుజారా కూడా ఫామ్లోకి వచ్చారు. ఓపెనర్లు ధావన్, రాహుల్లతో పాటు పాండ్యా కీలక పాత్ర పోషించనున్నాడు. తుది జట్టులో పేసర్లు ఇషాంత్, బుమ్రా ఖాయం కాగా... మ్యాచ్కి ముందు పరిస్థితులను బట్టి రెండో స్పిన్నర్కు అవకాశం ఉంటే షమీ స్థానంలో జడేజా జట్టులోకి వస్తాడు. కొత్తగా చివరి రెండు టెస్టులకు ఎంపికైన విహారి, పృథ్వీ షా టెస్టు జట్టులో చోటు కోసం కొంతకాలం ఎదురు చూడాల్సిందే.
|
రెండు మార్పులతో బరిలోకి ఇంగ్లాండ్
మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్ రెండు కీలక మార్పులు చేసింది. క్రిస్ వోక్స్ స్థానంలో పేసర్ శామ్ కర్రన్ను ఎంచుకోగా మిడిలార్డర్ బ్యాట్స్మన్ పోప్కు బదులుగా ఆల్రౌండర్ మొయిన్ అలీని జట్టులోకి తీసుకుంది. తొడ గాయం కారణంగా స్టోక్స్ బౌలింగ్ చేయడంపై సందేహాలు ఉండటంతో అలీ కీలకమవుతాడని రూట్ చెప్పాడు. సౌతాంప్టన్లో వాతావరణం పొడిగా ఉండటం, పిచ్ స్పిన్నర్లకు అనుకూలించవచ్చన అంచనాలుండటంతో ఇప్పటికే జట్టులో కొనసాగుతున్న రషీద్తో పాటు మొయిన్ అలీకి చోటు కల్పించారు.
వికెట్ బ్యాటింగ్కు అనుకూలం
దీంతో జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఖాయమయ్యారు. ఈ మైదానంలో అలీ ఆరు వికెట్లు తీసిన ఘనత ఉండటంతో తుది జట్టులో అతన్ని తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఘోరంగా విఫలమవుతున్న ఓపెనర్లు కుక్, జెన్నింగ్స్లకు ఇంగ్లాండ్ మరో అవకాశం ఇచ్చింది. మరోవైపు ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. మొత్తంగా వికెట్ బ్యాటింగ్కు అనుకూలంగా కనిపిస్తోంది. వాతావరణం పొడిగా ఉంది. కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. 2014లో ఇదే మైదానంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ 266 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.
మధ్యాహ్నాం 3.30 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్-3లలో ప్రత్యక్ష ప్రసారం