India vs England, 3rd Test: కోహ్లీ సెంచరీ, ఇంగ్లీషు గడ్డపై అత్యధికం

లండన్: ఇంగ్లీషు గడ్డపై వరుస పరాజయాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా నాటింగ్హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేయగా, పుజారా, హార్దిక్ పాండ్యాలు హాఫ్ సెంచరీలతో టీమిండియా ఆతిథ్య ఇంగ్లాండ్కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐదు రోజులు టెస్టులో రెండు రోజులు మిగిలున్న టెస్ట్లో భారత్ విజయానికి మరో అడుగు దూరంలో నిలిచింది. భారత్ నిర్దేశించిన 521 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కుక్(9), జెన్నింగ్స్(13) పరుగులతో ఉన్నారు.

197 బంతుల్లో కోహ్లీ సెంచరీ
ఓవర్నైట్ స్కోరు 124/2తో రెండో ఇన్నింగ్స్కు దిగిన భారత్.. కెప్టెన్ కోహ్లీ(197 బంతుల్లో 103, 10ఫోర్లు) సెంచరీకి తోడు పుజారా(208 బంతుల్లో 72, 9ఫోర్లు), హార్దిక్ పాండ్యా(52 బంతుల్లో 52 నాటౌట్, 7 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో 352/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో రషీద్(3/101), స్టోక్స్(2/68) రాణించారు. రెండు రోజులు మిగిలున్న ఈ టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే 498 పరుగులు చేయాల్సి ఉండగా, భారత్ పది వికెట్లు తీయాలి. గత ఇంగ్లాండ్ పర్యటనతో పోలిస్తే, ప్రస్తుత సిరిస్లో కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు.

విమర్శలకు దీటైన సమధానమిచ్చిన కోహ్లీ
వరుసగా రెండు మ్యాచ్ల ఓటముల నుంచి వస్తున్న విమర్శలకు దీటైన సమధానమిస్తూ సెంచరీతో చెలరేగాడు. ఓవర్నైట్ స్కోరు 124/2తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. పుజారా(72), కోహ్లీ ఇద్దరూ నిలకడగా ఆడుతూ పరుగుల వరద పారించారు. తొలి సెషన్ మొదటి గంటలోపే ఏడు ఓవర్లు వేసిన అండర్సన్ మూడు మెయిడిన్లతో పాటు ఏడు పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత క్రిస్వోక్స్, బెన్ స్టోక్స్ భారత బ్యాట్స్మన్పై ఒత్తిడి పెంచినప్పటికీ వికెట్ తీయడంలో విఫలమయ్యారు.

ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న పుజారా
అండర్సన్ బౌలింగ్లో 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పుజారా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని తిరిగి తన పూర్వ వైభవాన్ని అందుకున్నాడు. లంచ్ విరామ సమయానికి పుజారా, కోహ్లీ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. లంచ్ విరామం తర్వాత స్టోక్స్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయిన పుజారా స్లిప్లో కుక్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీంతో మూడో వికెట్కు 113 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన అజ్యింకే రహానే(29)తో కలిసి విరాట్ కోహ్లీ తన దూకుడుగా ఆడాడు.

టెస్టుల్లో 23వ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ
ఒకవైపు రహానే సహకారం తీసుకుంటూనే మరోవైపు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వోక్స్ బౌలింగ్లో బౌండరీతో కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది 23వ సెంచరీ. దీంతో కెప్టెన్గా అత్యధిక సెంచరీలు చేసిన గ్రేమ్స్మిత్(25), రికీ పాంటింగ్(19) తర్వాత కోహ్లీ(16) మూడోస్థానంలో ఉన్నాడు. అంతేకాదు 440 ఇంగ్లాండ్తో ఓ టెస్ట్ సిరీస్లో కెప్టెన్గా అత్యధిక పరుగులు(440) రికార్డును కోహ్లీ నెలకొల్పాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్(426 పరుగులు) రికార్డుని అధిగమించాడు.

ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 521
ఆ తర్వాత ఓవర్ తేడాతో వోక్స్కే వికెట్ సమర్పించుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చిన పంత్(1) అండర్సన్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ తర్వాత రహానేతో కలిసి హార్దిక్ పాండ్యా(52 నాటౌట్) దూకుడుగా ఆడాడు. భారీ లక్ష్యాన్ని నిర్దేశించే క్రమంలో పాండ్యా బౌండరీలతో చెలరేగాడు. 20 పరుగుల తేడాతో రహానే, షమీ(3) వికెట్లు కోల్పోయిన భారత్ తన ఇన్నింగ్స్ను 352/7 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లీషు గడ్డపై ఆతిథ్య జట్టుకు భారత్ నిర్దేశించిన లక్ష్యం 521.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications