|
పది బంతులకే మళ్లీ వర్షం
ఆ తర్వాత మరో ఫోర్ కొట్టిన రాహుల్ ఏడో ఓవర్లో ఆండర్సన్ బంతిని ఆఫ్ సైడ్ ఆడబోగా ఎడ్జ్ తీసుకుని కీపర్ బెయిర్స్టో చేతుల్లోకి వెళ్లింది. ఇంకో రెండు బంతులకే వర్షంతో ఆట ఆగిపోయింది. అప్పటికి భారత స్కోరు 11/2. దీంతో లంచ్ విరామాన్ని ప్రకటించగా తొలి సెషన్ 6.3 ఓవర్ల పాటు సాగినట్టయింది. కానీ పది బంతులకే మళ్లీ వర్షం వల్ల ఆట ఆగిపోయింది. అయితే ఈ పది బంతుల ఆటలోనే భారత్ ఒక వికెట్ కోల్పోయింది. తొమ్మిదో ఓవర్లో ఒక బంతి వేయగానే మళ్లీ చినుకులు పడడంతో కోహ్లీ, పుజారా పెవిలియన్కు చేరారు.
|
వర్షం ఆగడంతో తిరిగి క్రీజులోకి
వర్షం ఆగడంతో తిరిగి క్రీజులోకి వచ్చారు. అదే ఓవర్ మూడో బంతికి భారత్కు గట్టి దెబ్బే తగిలింది. ఆండర్సన్ బౌలింగ్లో పుజారా పాయింట్ వైపు ఆడగా కోహ్లీ రన్ కోసం వేగంగా ముందుకు వచ్చాడు. దీంతో పుజారా కూడా క్రీజులో నుంచి కదిలాడు. అయితే పిచ్ మధ్యలోకి వచ్చిన అనంతరం కోహ్లీ మనసు మార్చుకుని తిరిగి వెనక్కి వెళ్లాడు. అయితే అప్పటికే చాలా ముందుకు వచ్చిన పుజారా రనౌట్ కావాల్సి వచ్చింది. ఆ వెంటనే మరోసారి వర్షం ఆటంక పరచడంతో టీ బ్రేక్ను కూడా కానిచ్చారు. అప్పటికి జట్టు 8.3 ఓవర్లు మాత్రమే ఆడింది.
|
భారత బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ
చివరి సెషన్లో అయినా కుదురుగా ఆడతారనుకున్న భారత బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. ఆరంభంలో కోహ్లీ, రహానే ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ ఆరంభించారు. మంచి ఎండ కాస్తుండడంతో ప్రారంభంలో బౌలింగ్ అంత ప్రమాదకరంగా కనిపించలేదు. వీళ్లిద్దరూ గంట పాటు.. 13 ఓవర్లకు పైగా వికెట్ పడనివ్వలేదు. కోహ్లి ఆత్మవిశ్వాసంతో కనిపించడం.. రహానె కూడా నిలదొక్కుకోవడంతో పరిస్థితి మారుతున్నట్లే కనిపించింది. వీళ్లిద్దరూ ఆఫ్ సైడ్ ఆవల ప్రమాదకర బంతుల్ని విడిచిపెట్టారు. ఆచితూచి ఆడారు.
|
క్రిస్ వోక్స్ భారత్కు అతి పెద్ద షాక్
భారత్ 15/3 నుంచి 49/3కు చేరుకుంది. 12వ ఓవర్లో ఫోర్ తీసిన రహానె అదే ఓవర్ ఆఖరి బంతికి ఇచ్చిన క్యాచ్ను నాలుగో స్లిప్లో ఉన్న రూట్ వదిలేశాడు. అయితే క్రిస్ వోక్స్ భారత్కు అతి పెద్ద షాక్ ఇచ్చాడు. 22వ ఓవర్లో మూడో బంతికి కోహ్లీ ఇచ్చినక్యాచ్ను బట్లర్ వదిలేయగా ఫోర్ వెళ్లింది. అయితే ఆ తర్వాతి బంతికే ఇచ్చిన క్యాచ్ను మాత్రం వదల్లేదు. ఆ తర్వాత తన మరో ఓవర్లో పాండ్యా (11) క్యాచ్ను కూడా బట్లర్ అందుకున్నాడు. అటు కర్రాన్ ఓవర్లో దినేశ్ కార్తీక్ (1) అవుట్ కావడంతో 62 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.
|
అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి పేసర్ జేమ్స్ ఆండర్సన్
ఓ ఎండ్లో పట్టుదలతో ఆడుతున్న రహానేను కూడా అండర్సన్ ఔట్ చేయడంతో భారత్ మరింత కష్టాల్లో పడింది. అప్పటికి స్కోరు 84/7. ఈ దశలో అశ్విన్ ధాటిగా ఆడి.. స్కోరును వంద దాటించాడు. కానీ వికెట్ల పతనం మాత్రం ఆగలేదు. ఆ తర్వాత ఇషాంత్ వికెట్ల ముందు దొరికిపోవడంతో భారత్ ఆలౌటైంది. అండర్సన్కు అది ఐదో వికెట్ కావడం విశేషం. భారత్పై అత్యధిక వికెట్లు (95) పడగొట్టిన తొలి పేసర్ జేమ్స్ ఆండర్సన్ నిలిచాడు. సొంత గడ్డపై అత్యధిక వికెట్లు (354) తీసిన బౌలర్లలో ఆండర్సన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఒక్క లార్డ్స్లోనే 99 వికెట్లు పడగొట్టాడు.