హైదరాబాద్: ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్ కోసం భారత్ జట్టు సరిగా సిద్ధమవ్వలేదని ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టును విశ్లేషించాడో.. లేదా పరోక్షంగా రెచ్చగొడుతున్నాడో అర్థం కానీ, విధంగా చెప్పిన మాటలను టీమిండియా బ్యాట్స్మన్ ఎలా అర్థం చేసుకుంటారో వేచి చూడాలి.
బర్మింగ్హామ్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టులో విరాట్ కోహ్లి మినహా టీమిండియా బ్యాట్స్మెన్స్ విఫలమవడంతో ఇంగ్లాండ్ జట్టు 31 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో కేవలం కోహ్లీ (రెండు ఇన్నింగ్స్ కలిపి 200పరుగులు) మినహా ఏ బ్యాట్స్మన్ అంతగా రాణించలేకపోయారు. రెండో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి లార్డ్స్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన హుస్సేన్.. సిరీస్కి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ని మూడు రోజులకి భారత్ తగ్గించుకోవడాన్ని తప్పుబట్టాడు.
'టెస్టు సిరీస్ కోసం భారత్ జట్టు పూర్తిగా సన్నద్ధమవ్వలేదేమో..? అని నాకు అనిపిస్తోంది. తొలి టెస్టుకి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ను మూడు రోజులకే భారత్ తగ్గించుకోవడం ఆశ్చర్యపరిచింది. తొలి టెస్టులో అండర్సన్, బ్రాడ్, బెన్స్టోక్స్, కుర్రాన్ స్వింగ్ రాబడుతుంటే.. తొలి టెస్టులో బ్యాట్స్మెన్లు చేతులెత్తేశారు. క్లిష్ట సమయాల్లో సహనంతో క్రీజులో నిలిచే పుజారాని తుది జట్టులోకి తీసుకోకపోవడం అక్కడ భారత్ని మరింత దెబ్బతీసింది. బహుశా.. రెండో టెస్టులో అతను ఆడచ్చేమో..?' అని నాసర్ హుస్సేన్ వెల్లడించాడు.
మరో పక్క కోహ్లీ ఓ ప్రత్యేక సమావేశంలో పాల్గొని రెండో టెస్టుకు టీమిండియా పూర్తి సన్నద్ధతతో ఉందని పేర్కొన్నాడు. భారత అభిమానులు క్రికెట్ను ఇంగ్లాండ్కు వరకూ రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. జట్టును ప్రోత్సహించండి. ఏ ఒకరిద్దరినో కాదంటూ కెప్టెన్గా జట్టుకు మద్దతు తెలిపాడు.