అశ్విన్.. ఇషాంత్ చేతిలో ఇంగ్లాండ్ చిత్తుచిత్తు:
టీమిండియా బౌలింగ్ దాడితో ఇంగ్లాండ్ ఉక్కిరిబిక్కిరైపోయింది. గిరాగిరా బంతులతో అశ్విన్.. పదునైన పేస్, స్వింగ్తో ఇషాంత్శర్మ ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించారు. ఓవర్నైట్ 9/1తో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టు పతనం ఆరంభం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. జెన్నింగ్స్ (8) నిష్క్రమణతో మొదలైన పతనం వేగంగా సాగిపోయింది. అశ్విన్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో ఎడమచేతివాటం బ్యాట్స్మన్ జెన్నింగ్స్ను బలిగొన్నాడు. ఆఫ్స్టంప్పై పడి నేరుగా దూసుకొచ్చిన బంతిని ఆడబోయిన జెన్నింగ్స్ లెగ్ స్లిప్లో రాహుల్ అందుకున్న చురుకైన క్యాచ్కు నిష్క్రమించాడు.
లంచ్ విరామానికి ముందే ఆరు వికెట్లు:
కెప్టెన్ రూట్ (14)ను కూడా అశ్విన్ వెనక్కి పంపాడు. లెగ్ స్లిప్లో రాహుల్ తక్కువ ఎత్తులో అందుకున్న మరో కళ్లు చెదిరే క్యాచ్కు రూట్ వెనుదిరిగాడు. ఇక బెయిర్స్టో (28) క్రీజులో ఉన్నంతసేపూ అసౌకర్యంగానే కదిలాడు. ఇషాంత్ పదునైన పేస్తో అతడికి సమస్యలు సృష్టించాడు. చివరికి ఇషాంతే.. ఓ చక్కని ఇన్స్వింగర్తో బెయిర్స్టో ఇబ్బందులకు తెరదించాడు. వదిలే అవకాశం లేని ఆ బంతిని ఆడే ప్రయత్నంలో అతడు.. ధావన్కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి స్కోరు 85/5. అదే ఓవర్లో ఓ ఔట్స్వింగర్తో స్టోక్స్ (6)ను కూడా ఔట్ చేసి ఇంగ్లాండ్ను గట్టి దెబ్బతీశాడు ఇషాంత్. ఇషాంత్ వీళ్లిద్దరి కన్నా ముందు మలన్ (20)ను ఔట్ చేయడం ద్వారా తన వికెట్ల వేటను ఆరంభించాడు.
పాత కథే పునరావృతమై..
లంచ్ సమయానికి 86/6తో నిలిచిన ఇంగ్లాండ్... ఆట తిరిగి ఆరంభమైన వెంటనే బట్లర్ (1)నూ కోల్పోయింది. ఈ వికెట్టూ ఇషాంత్ ఖాతాలోకే. 87/7 ఉన్న ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టదనిపించింది. కానీ.. పాత కథే పునరావృతమైంది. ఇంగ్లాండ్ను 87/7కు పరిమితం చేసిన భారత్ ఓ సువర్ణావకాశాన్ని సృష్టించుకుంది. అద్భుతంగా బౌలింగ్ చేసి లోయర్ ఆర్డర్ను మాత్రం అదుపుచేయలేకపోయారు.
ఈసారి బ్యాటుతో భారత్ను దెబ్బతీసిన శామ్ కరన్:
తొలి ఇన్నింగ్స్లో బంతితో భారత్ను హడలెత్తించిన శామ్ కరన్ ఈసారి బ్యాటుతో భారత్ను దెబ్బతీశాడు. ధాటిగా ఆడి ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడు రషీద్ (16)తో ఎనిమిదో వికెట్కు 48, బ్రాడ్ (11)తో 9వ వికెట్కు 41 పరుగులు జోడించాడు. చివరికి ఉమేశ్ యాదవ్ (2/20) బౌలింగ్లో ఆఖరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు బ్రాడ్ను ఔట్ చేసి ఇషాంత్ శర్మ కెరీర్లో ఎనిమిదోసారి ఐదు వికెట్ల ఘనత సాధించాడు.
లక్ష్యం చిన్నదే అయినా.. మిగిలిందొక్కడే:
మళ్లీ భారమంతా కోహ్లిపైనే.ఇంగ్లాండ్ పేసర్లు బ్రాడ్, స్టోక్స్ ధాటికి భారత బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. కనీస పోరాటం కూడా కరవైంది. ఆరో ఓవర్లో విజయ్ (6)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడం ద్వారా భారత పతనాన్ని ఆరంభించాడు బ్రాడ్. తన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ ధావన్ (13)నూ అతడు వెనక్కి పంపాడు. పేలవ ఫామ్ను కొనసాగించిన ధావన్.. ఆఫ్స్టంప్ ఆవల బంతిని డ్రైవ్ చేయబోయి వికెట్కీపర్ బెయిర్స్టోకు చిక్కాడు.
నిరాశ పరచిన రాహుల్, రహానె:
ఓ వైపు కోహ్లి బంతులను చక్కగా వదిలేస్తూ, పట్టుదలతో నిలిచినా.. రాహుల్ (13), రహానె (2) కూడా మళ్లీ నిరాశపరిచారు. రాహుల్.. స్టోక్స్ బౌలింగ్లో బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చాడు. కరన్ బౌలింగ్లో ఆఫ్స్టంప్ ఆవల బంతిని వెంటాడి రహానె కూడా బెయిర్స్టో చేతికే చిక్కాడు. కార్తీక్ కన్నా ముందొచ్చిన అశ్విన్ (13) కూడా పెవిలియన్ బాట పట్టేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. అప్పటికి స్కోరు 78. కానీ కోహ్లికి కార్తీక్ అండగా నిలవడంతో భారత్ కోలుకుంది. విజయంపై ఆశలతో మూడో రోజును ముగించింది. కార్తీక్తో అభేద్యమైన ఆరో వికెట్కు కోహ్లి 32 పరుగులు జోడించాడు.