షకిబ్ను ప్రేమిస్తూనే ఉంటాం
తొలి టీ20 కోసం ఢిల్లీలో ఉన్న మహ్మదుల్లా రియాద్ తాజాగా మీడియాతో మాట్లాడారు. 'షకిబ్ చేసింది పొరపాటే తప్ప నేరం కాదు. మేం షకిబ్ను ప్రేమించాం. ఇప్పటికీ ప్రేమిస్తున్నాం. ఇంకా ప్రేమిస్తూనే ఉంటాం. నిషేధం అనంతరం జట్టులోకి పునరాగమనం చేయగానే సాదరంగా స్వాగతిస్తాం. డ్రస్సింగ్ రూమ్లోకి ప్రవేశించగానే మేమంతా గట్టిగా హత్తుకుంటాం' అని మహ్మదుల్లా తెలిపారు.
యువ ఆటగాళ్లకు ఇదో మంచి అవకాశం
'ఇప్పుడు మా దృష్టంతా తొలి టీ20 మ్యాచ్పైనే ఉంది. విజయం సాదించటానికి కష్టపడుతాం. భారత్ లాంటి అగ్ర జట్టుతో విజయ అంటే చాలా శ్రమించాలి. బంగ్లా తరఫున నిరూపించుకోవడానికి యువ ఆటగాళ్లకు ఇదో మంచి అవకాశం. మా లోపాలేంటో ఎప్పటికప్పుడు మాకు తెలుస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు మేం ధారాళంగా పరుగులు ఇస్తున్నాం. బ్యాటింగ్లో ఇంకా నిలకడ పెరగాలి. దీనిపై జట్టు యాజమాన్యం సరైన ప్రణాళికలు రచిస్తోంది' అని అన్నారు.
భారత్లో పరిస్థితులు వేరు
'యువ మణికట్టు స్పిన్నర్ అమినుల్ ఇస్లామ్ బాగా ఆడుతున్నాడు. మా జట్టులో ఓ మంచి మణికట్టు స్పిన్నర్ ఉండాలని ఎప్పట్నుంచో కోరుకుంటున్నాం. అఫ్గాన్పై అతడు నిరూపించుకున్నాడు. భారత్లో మాత్రం పరిస్థితులు వేరు. సొంతగడ్డపై వారు ఆధిపత్యం ప్రదర్శిస్తారు. అనుభవజ్ఞులైన మష్రఫె మొర్తజా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహ్మద్ సైఫుద్దీన్కు మా బౌలింగ్ విభాగంలో ఉన్నారు. స్పిన్ కూడా మా మరో బలం' అని మహ్మదుల్లా చెప్పుకొచ్చారు.
కీలక ఆటగాళ్లు లేకుండానే
కీలక ఆటగాళ్లు లేకుండానే బంగ్లా జట్టు పొట్టి ఫార్మాట్కు రెడీ అవుతోంది. ఐసీసీ షకిబ్పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇక తమీమ్ ఇక్బాల్, సైఫుద్దీన్ సిరీస్కు దూరం కావడంతో బంగ్లాదేశ్ జట్టు బలహీనపడింది. అయితే సీనియర్ ఆటగాళ్లు సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, మొసద్దిక్ హుస్సేన్ బ్యాటింగ్ భారం మోయనున్నారు. తొలి టీ20లో బంగ్లా జట్టు ఎలా ఆడనుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.