భారత జట్టు పటిష్టంగా ఉంది
భారత పర్యటన కోసం బంగ్లాదేశ్ ఆటగాళ్లు బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. గురువారం బంగ్లాదేశ్ క్రికెటర్లు పొల్యూషన్ మాస్క్లు ధరించి ప్రాక్టీస్ చేశారు. అనంతరం లిటాన్ దాస్ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవాలనుకుంటే అందుకు ఒక కారణం ఉంటుంది. దాని గురించి పెద్దగా ఆందోళన చెందట్లేదు. కోహ్లీ లేనంత మాత్రాన భారత జట్టు బలహీనంగా ఉందని నేను అనుకోవడం లేదు' అని అన్నాడు.
కోహ్లీ జట్టులో ఉన్నా, లేకున్నా ఒకటే
'భారత జట్టులో చాలా మంది మంచి ఆటగాళ్లు ఉన్నారు. జట్టులోని ప్రతీ ఆటగాడికి ప్రతిభ ఉంది. అలాంటప్పుడు కోహ్లీ లేనంత మాత్రాన ప్రభావం ఎలా ఉంటుంది. కోహ్లీ జట్టులో ఉన్నా, లేకున్నా ఒకటే. అది మాకు అసలు సమస్యే కాదు' అని లిటాన్ దాస్ పేర్కొన్నాడు. 'మా జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఈ పర్యటనకు దూరమయ్యారు. అయినా ఉన్న జట్టుతోనే సాధ్యమైనంతవరకూ పోరాడాలి' అని తెలిపాడు.
కోహ్లీకి విశ్రాంతి
తీరిక లేని క్రికెట్ ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20ల సిరీస్కు విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు మోయనున్నాడు. కోహ్లీతో పాటు మరికొంతమంది సీనియర్లు కూడా రెస్ట్ తీసుకున్నారు. మరోవైపు తమీమ్ ఇక్బాల్, షకీబ్ అల్ హసన్ వంటి స్టార్ ఆటగాళ్లు బంగ్లాదేశ్ జట్టులో లేరు. వ్యక్తిగత కారణాల వల్ల తమీమ్ ఈ పర్యటనకు దూరం కాగా.. షకీబ్కు ఐసీసీ 2 సంవత్సరాల నిషేధం విధించిన విషయం తెలిసిందే.
కాలుష్య సెగ
ఢిల్లీలో గురువారం ప్రాక్టీస్ చేసిన బంగ్లాదేశ్ క్రికెటర్లకు వాయు కాలుష్య సెగ తప్పలేదు. అక్కడ వాయు కాలుష్యం ఎక్కువగా ఉండటంతో మబ్బులతో కూడిన వాతావరణం నెలకొంది. తొలి మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెటర్లు పొల్యూషన్ మాస్క్లు ధరించి ప్రాక్టీస్ చేశారు. తప్పని పరిస్థితుల్లో ప్రాక్టీస్ను కొనసాగించారు. ఢిల్లీలో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో వేదికను చివరి దశలో మార్చాలని చూసినా.. సాధ్యపడలేదు. దాంతో ఢిల్లీలోనే తొలి టీ20 జరుగనుంది.