మ్యాచ్ నాటికి ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) తగ్గుముఖం పట్టనుందని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ బీసీసీఐ, డీడీసీఏలకు సమాచారం ఇచ్చింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే తొలి టీ20 జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది.
'ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ నుండి అనుమతి తీసుకున్నాం. నవంబర్ 3న గాలి నాణ్యత మామూలుగానే ఉంటుందని వారు స్పష్టం చేసారు. దీంతో ఢిల్లీలోనే తొలి టీ20 మ్యాచ్ నిర్వహించాలి నిర్ణయించాం. ప్రస్తుతానికి సమస్య పరిష్కరించబడింది. మేము ప్రణాళికలో ఎటువంటి మార్పు చేయం' అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ దశాబ్దంలో జడేజానే బెస్ట్ ఫీల్డర్.. బ్యాట్స్మన్, బౌలర్గా సూపర్!!
నవంబర్ 3న భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మామూలుగానే ఎక్కువగా ఉంటుంది. శీతకాలం సమీపించడం, దీపావళి టపాసులతో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. మూడు రోజుల క్రితం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 357గా నమోదైంది. 400 దాటితే తీవ్ర శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఇక దీపావళి పండుగ నేపథ్యంలో గాలి నాణ్యత మరింత దిగజారుతుంది.
అయితే పండగ జరిగిన వారం రోజుల తర్వాత మ్యాచ్ ఉండడంతో.. సమస్య తీవ్రత తగ్గుతుందని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ స్పష్టం చేసింది. మరోవైపు ఢిల్లీ వాతావరణంతో ఆటగాళ్లు అస్వస్థతకు గురికాకుండా ఉండడానికి మాస్కులు ధరించేలా చూడాలని డీడీసీఏ భావిస్తోంది. గతంలో కూడా ఆటగాళ్లు మాస్క్లు ధరించి ఇక్కడ ఆడిన సందర్భాలు ఉన్నాయి. 2017, డిసెంబర్లో శ్రీలంక ఆటగాళ్లు ముఖానికి మాస్క్లు ధరించి ఆడారు. అయినా రెండు మూడు సార్లు మ్యాచ్కు అంతరాయం కలిగింది.
శీతకాలంలో డిల్లీలో మ్యాచ్లు నిర్వహించొద్దని ఎప్పటినుండో డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ.. రొటేషన్ ప్రకారం మ్యాచ్లను కేటాయించక తప్పటం లేదు. ఈ రొటేషన్ పాలసీ ప్రకారమే తొలి టీ20ని ఢిల్లీకి కేటాయించాల్సి వచ్చింది. పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ జట్టు నేరుగా డిల్లీకి చేరుకుంటుంది.