ఐపీఎల్ ఆడినంత మాత్రాన.. ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తారా?: షేన్ వార్న్ ఫైర్

కాన్బెర్రా: ఆస్ట్రేలియా మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)పై ఫైర్ అయ్యాడు. కాన్బెర్రా వేదికగా బుధవారం జరిగిన మూడో వన్డేలో ఆసీస్ స్టార్ పేసర్ పాట్ కమిన్స్ను పక్కనపెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2020 ఆడినంత మాత్రాన.. ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తారా? అని సీఏను ప్రశ్నించాడు. ఎవరైనా దేశం తరపున ఆడడమే మొదటి ప్రాధాన్యత అని వార్న్ పేర్కొన్నాడు. వార్న్ ఆసీస్ తరపున 145 టెస్టులు, 194 టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 708 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా వార్న్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
నవంబర్ 10న యూఏఈ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 తర్వాత ఆసీస్ ఆటగాళ్లు నేరుగా టీమిండియాతో వన్డే సిరీస్ ఆడాల్సి వచ్చింది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. దీంతో రానున్న టెస్టు సిరీస్ను దృష్టిలో పెట్టుకొని ఆసీస్ ప్రధాన బౌలర్గా ఉన్న పాట్ కమిన్స్కు మూడో వన్డే నుంచి విశ్రాంతి కల్పించారు. సుదీర్ఘమైన ఐపీఎల్ టోర్నీ ఆడడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఐపీఎల్ 2020లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున కమిన్స్ ఆడాడు.
తాజాగా ఫాక్స్ క్రికెట్తో షేన్ వార్న్ మాట్లాడుతూ... 'పాట్ కమిన్స్కు విశ్రాంతినివ్వడంపై నేను నిరాశకు లోనయ్యా. ఐపీఎల్ 2020 ఆడినంత మాత్రాన ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తారా?. ఇలా అయితే ఆటగాళ్లను ఐపీఎల్కు పంపించాల్సింది కాదు. ఏ లీగ్ ఆడినా ఆటగాళ్లకు దేశం తరపున ఆడడమే మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. అలసిపోయారనే భావనతో కమిన్స్ లాంటి ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం సరికాదు' అని అన్నాడు.
'ఐపీఎల్ అనేది ఒక లీగ్. ఏడాదికి ఇలాంటి లీగ్లు ఎన్నో జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఆడుతున్నది అంతర్జాతీయ వన్డే మ్యాచ్. మూడో వన్డేలో పాట్ కమిన్స్ను ఆడిస్తే బాగుండేది. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం నాకు నచ్చలేదు' అని షేన్ వార్న్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2020లో పాట్ కమిన్స్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 14 మ్యాచ్లాడిన కమిన్స్ 7.86 ఎకానమి రేటుతో 12 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో రూ.16 కోట్లు పెట్టి సొంతం చేసుకున్న కోల్కతాకు అతడు న్యాయం చేయలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications