

హైదరాబాద్: ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి కావాల్సిన పరుగులు 13. చివరి వరకు ఉత్కంఠ. చివరి వరకు పోరాడి కోహ్లీసేన 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. బ్రిస్బేన్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 17 ఓవర్లకు చేసింది 158/4. వర్షం కారణంగా ఈ మ్యాచ్ని 17 ఓవర్లకు కుదించారు.
అనంతరం డక్వర్త్ లూయిస్ ప్రకారం కోహ్లీసేనకు మాత్రం 174 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. ఛేదన అత్యంత ఉత్కంఠకరంగా సాగినప్పటికీ, వరుస బంతుల్లో కృనాల్ పాండ్యా, దినేశ్ కార్తీక్ ఔట్ కావడంతో భారత ఓటమి తప్పలేదు. 174 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఈ విజయంతో మూడు టీ20ల సిరిస్లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాట్స్మెన్లలో ఓపెనర్ శిఖర్ ధావన్ (76) హాఫ్ సెంచరీతో చేయగా, చివర్లో దినేష్ కార్తీక్ (13 బంతుల్లో 30) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. భారత్ను ఓటమి నుంచి తప్పించలేకపోయారు. రెండో టీ20 శుక్రవారం మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత ఫీల్డర్లు రెండు క్యాచ్లు జారవిడచడంతో ఆసీస్ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లీ (4) పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.