కాన్బెర్రా: మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి మ్యాచులో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 రన్స్ చేసింది. రవీంద్ర జడేజా (44*; 23 బంతుల్లో, 5×4, 1×6) ధనాధన్ ఇన్నింగ్స్కు ఓపెనర్ కేఎల్ రాహుల్ (51; 40 బంతుల్లో, 5×4, 1×6) అర్ధ శతకం చేయడంతో ఆస్ట్రేలియాకు భారత్ 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే రాహుల్ హాఫ్ సెంచరీ చేసే క్రమంలో ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో రాహుల్ 1500 రన్స్ చేశాడు.
తొలి టీ20 మ్యాచులో కేఎల్ రాహుల్ 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండగా.. టీ20ల్లో 1500 రన్స్ పూర్తి చేశాడు. రాహుల్ కేవలం 39 ఇన్నింగ్స్లలోనే ఈ ఘనతను చేరుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్లలో 1500 పరుగుల చేసిన బ్యాట్స్మన్గా కూడా నిలిచాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్, ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సరసన రాహుల్ చేరాడు. కోహ్లీ, బాబర్, ఫించ్ ముగ్గురూ కూడా 39 ఇన్నింగ్స్లలోనే 1500 రన్స్ పూర్తి చేశారు. అంతేకాకుండా ఈ మ్యాచ్తో ఈ ఏడాది అంతర్జాతీయ టీ20ల్లో రాహుల్ 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఇండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (1) త్వరగానే పెవిలియన్ చేరాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (9)తో కలిసి కేఎల్ రాహుల్ వేగంగా పరుగులు సాధించడంతో పవర్ప్లేలో భారత్ 42 పరుగులు సాధించింది. కాగా ఏడో ఓవర్లో కోహ్లీని స్పిన్నర్ స్వెప్సన్ ఔట్ చేశాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన సంజు శాంసన్ (23; 15 బంతుల్లో, 1×4, 1×6)తో పాటు కేఎల్ రాహుల్ ధాటిగా ఆడటంతో భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. లాఫ్టెడ్ షాట్లతో వీరిద్దరు బౌండరీలు బాదారు. ఈ క్రంమలోనే రాహుల్ హాఫ్ సెంచరీ బాదాడు.
అయితే ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ఆరు పరుగుల వ్యవధిలోనే శాంసన్, మనీష్ పాండే (2), కేఎల్ రాహుల్ ఔటవ్వడంతో భారత్ 92 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన హార్దిక్ పాండ్యా (16; 15 బంతుల్లో, 1×6) ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయాడు. అయితే ఇన్నింగ్స్ చివరలో రవీంద్ర జడేజా విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి ధాటికి ఆఖరి మూడు ఓవర్లలో భారత్ 46 పరుగులు పిండుకుంది. లక్ష్య ఛేదనలో ఆసీస్ జోరుగా ఆడుతోంది. 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 54 రన్స్ చేసింది. ఫించ్ (34), షార్ట్ (18) క్రీజులో ఉన్నారు.
IPL 2021లో కొత్త ఫార్మాట్.. లీగ్ దశలో అన్ని జట్లు కలిపి 14 మ్యాచ్లే!