

హైదరాబాద్: మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (143: 115 బంతుల్లో 18x4, 3x6), రోహిత్ శర్మ (95: 92 బంతుల్లో 7x4, 2x6) అద్భుత ప్రదర్శన చేయడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.
దీంతో పర్యాటక జట్టుకు 359 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ ఐదు వికెట్లు తీసుకోగా, రిచర్డ్సన్ మూడు, ఆడమ్ జంపా ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్లో భారత్ భారీ లక్ష్యానికి కారణమైన టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఆస్ట్రేలియాపై తొలి మూడు వన్డేల్లోనూ నిరాశపరిచిన శిఖర్ ధావన్ ఆరంభం నుంచే వరుస బౌండరీలతో జోరు అందుకోగా.. క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన రోహిత్ శర్మ మొదటి పవర్ప్లే ముగిసిన తర్వాత దూకుడుగా ఆడాడు.
ఇద్దరూ పోటీపడి మరీ బౌండరీలు బాదారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి తొలి వికెట్కు 193 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ(95; 92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (143: 115 బంతుల్లో 18x4, 3x6) సెంచరీతో మెరిశాడు. వన్డేల్లో శిఖర్ ధావన్కు ఇది 16వ సెంచరీ.
ఈ క్రమంలో వన్డేల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగుల భాగస్వామ్యం సాధించిన భారత్ ఓపెనింగ్ జోడిగా సరికొత్త రికార్డును నెలకొల్పారు. 2013లో నాగ్పూర్లో జరిగిన వన్డేలో ఈ జోడి 178 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించింది. తాజా మ్యాచ్లో 193 పరుగులతో దానిని సవరిస్తూ సరికొత్త రికార్డుని నెలకొల్పారు.