హైదరాబాద్: బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బౌలింగ్పై ఎదురుదాడే ఉత్తమమని వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే అభిప్రాయపడ్డాడు. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం ఉదయం 5.30 గంటల నుంచి మూడో టెస్టు మెల్ బోర్న్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
కోహ్లీ గ్రేటెస్ట్ క్రికెటర్: బాక్సింగ్ డే టెస్టుపై షేన్ వార్న్ స్పెషల్ వీడియో
ఈ నేపథ్యంలో మంగళవారం రహానే మీడియాతో మాట్లాడుతూ "టెస్టుల్లో చతేశ్వర్ పుజారా తరహాలో నెమ్మదిగా ఆడటం ముఖ్యమే. అయితే, నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడు.. రెండు అడుగులు ముందుగా ఆలోచించి ఎదురుదాడికి ప్రయత్నించాలి. పెర్త్ టెస్టులో నేను అలానే ఆడేందుకు ప్రయత్నించాను" అని చెప్పుకొచ్చాడు.
అయితే, మ్యాచ్ గమనానికి అనుగుణంగా ఆటతీరుని మార్చుకోవడం కూడా కీలకమేనని రహానే అన్నాడు. బాక్సింగ్ డే టెస్టులో కనీసం సెంచరీ సాధిస్తానని ఇప్పటికే రహానే బాహాటంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా ముగిసిన రెండో టెస్టు మ్యాచ్లో దూకుడుగా ఆడిన రహానే తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో మెరిశాడు.
కాగా, అంతకముందు అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ రహానే 13, 70 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో రహానేకి మంచి రికార్డు ఉంది. 2014-15 పర్యటనలో మెల్బోర్న్ వేదికగా జరిగిన టెస్టులో 147, 48 పరుగులు చేశాడు.