పర్యాటక జట్లు 18 మ్యాచులే:
అడిలైడ్కు ఎంతో చరిత్ర ఉంది. పిచ్ ఫ్లాట్గా ఉండటంతో బ్యాట్స్మెన్ పరుగుల పండగ చేసుకొనేవారు. బౌలర్లకు సహకారం తక్కువే అని చెప్పాలి. అయితే మూడోరోజు తర్వాత స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు. 2013 నుంచి డ్రాప్ఇన్ పిచ్లు వాడుతుండటంతో.. పరిస్థితుల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. బౌలర్లు కూడా ఆధిపత్యం చెలాయించిన ఘటనలు అక్కడక్కడ ఉన్నాయి. అడిలైడ్లో 1884లో తొలి మ్యాచ్ జరిగింది. ఇప్పటి వరకు 78 టెస్టులు ఇక్కడ జరిగాయి. ఇక్కడ ఆసీస్ 41 (52.56%) విజయాలు సాధిస్తే.. పర్యాటక జట్లు 18 (23.08%) మ్యాచుల్లో గెలిచాయి. 19 (24.36%) మ్యాచులు డ్రాగా ముగిశాయి. ఇక ఈ మైదానంలో దాదాపు 50వేల మంది అభిమానులు వీక్షించొచ్చు.
ద్రవిడ్ డబుల్:
అడిలైడ్లో భారత్ 12 మ్యాచులు ఆడగా.. 2 గెలిచి 7 ఓడింది. మరో 3 డ్రా చేసుకుంది. 1948 నుంచి ఇక్కడ ఆడుతుంటే 2003లో తొలిసారి భారత్ విజయం సాధించింది. మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అద్భుతాలు చేయడంతో సిరీస్ 1-1తో సమమైంది. అడిలైడ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 556కు ఆలౌటైంది. రికీ పాంటింగ్ (242) డబుల్ సెంచరీ చేశాడు. ద్రవిడ్ (233), వీవీఎస్ లక్ష్మణ్ (148) పోరాడటంతో భారత్ 523 పరుగులు చేసింది. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ 2, అజిత్ అగార్కర్ 6 చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 196కే ఆలౌట్ అయింది. ఆపై వీరేంద్ర సెహ్వాగ్ (47), ద్రవిడ్ (72) రాణించడంతో భారత్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
పుజారా అద్భుత సెంచరీ:
2018-19 పర్యటనలో ఆసీస్ను కోహ్లీసేన ఓడించి 2-1తో సిరీస్ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. చెతేశ్వర్ పుజారా (123) అద్భుత సెంచరీతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 250కి ఆలౌటైంది. టాప్ ఆర్డర్ విఫలమైనా జట్టును ఆదుకున్నాడు. ట్రావిస్ హెడ్ (72) అండతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 235 రన్స్ చేసింది. పుజారా (71), అజింక్య రహానె (70), కేఎల్ రాహుల్ (44) రాణించడంతో రెండో ఇన్నింగ్స్లో భారత్ 307 పరుగులు చేసింది. ఆపై మొహ్మద్ షమీ, ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా తలో 3 వికెట్లు తీయడంతో ఆసీస్ 291కే ఆలౌటైంది. భారత్ 31 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
6 సార్లు విఫలం:
అడిలైడ్లో మొత్తం 78 మ్యాచులు జరగ్గా.. లక్ష్యాలను ఛేదించింది కేవలం 11 సార్లు మాత్రమే. 31 సార్లు ఆయా జట్లు విఫలమయ్యాయి. 15 సార్లు డ్రా చేసుకున్నాయి. భారత్ ఇక్కడ 8 సార్లు ఛేదనకు దిగగా.. 6 సార్లు విఫలమైంది. 1981లో ఒకసారి 331 లక్ష్య ఛేదనకు దిగి 135/8తో డ్రా చేసుకుంది. 2003లో 230 పరుగుల లక్ష్యాన్ని తొలిసారి ఛేదించింది. ఈ మైదానంలో డేవిడ్ వార్నర్ (335)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. విరాట్ కోహ్లీ 3 మ్యాచులాడి 431 పరుగులు చేశాడు. అయితే ఇక్కడ అతడు 3 శతకాలు చేయడం గమనార్హం. పుజారా రెండు మ్యాచుల్లో 72 సగటుతో 288 పరుగులు సాధించాడు. నాథన్ లియాన్ ఇక్కడ 9 మ్యాచుల్లో 50 వికెట్లు తీశాడు. అశ్విన్ 2 మ్యాచుల్లో 11 వికెట్లు పడగొట్టాడు.
విదేశీ జట్ల పేలవ ప్రదర్శన:
డే/నైట్ టెస్ట్ రికార్డు చూస్తే.. ఒక్క టెస్టులో మినహా ఆస్ట్రేలియా జట్టును ప్రత్యర్థి జట్లు ఇబ్బంది పెట్టలేకపోయాయి. కంగారూలు రెండు మ్యాచ్లలో ఇన్నింగ్స్ విజయాలు సాధించగా.. ఒక మ్యాచ్లో 296 పరుగులతో గెలిచారు. ఏ విదేశీ జట్టు బ్యాటింగ్ సగటు కూడా ఒక్కో వికెట్కు 30 పరుగులకు మించిలేదు. ఒకసారి దక్షిణాఫ్రికా తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయడం మినహా 13 ఇన్నింగ్స్లలోనూ ప్రత్యర్థి జట్లు ఆలౌట్ అయ్యాయి. మొత్తంగా చూస్తే గులాబీ బంతితో డే/నైట్ టెస్టులు ఆడటంలో అనుభవలేమినే ఈ జట్లలో కనిపిస్తోంది. ఇప్పుడు భారత్ కూడా అలాంటి స్థితిలోనే పట్టుదల కనబర్చి సిరీస్లో శుభారంభం చేయాల్సి ఉంది.
Kohli vs Paine: 'స్లెడ్జింగ్' అర్థరహితం అంటున్న కోహ్లీ.. వెనకడుగు వేయమంటున్న పైన్!!