హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియాల మధ్య మూడు వన్డేల సిరిస్లో చివరిదైన మూడో వన్డే శుక్రవారం ప్రారంభమైంది. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ వన్డేలో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ తుది జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి.
రెండో వన్డేలో ధారాళంగా పరుగులిచ్చిన హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్పై వేటు పడగా.. అతని స్థానంలో ఆల్రౌండర్ విజయ్ శంకర్కి అవకాశం దక్కింది. తొలి రెండు వన్డేల్లోనూ నిరాశపరిచిన మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు స్థానంలో కేదార్ జాదవ్, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో చాహల్కి ఛాన్స్ లభించింది.
Vijay Shanker is all set to make his debut for #TeamIndia 👏👏#AUSvIND pic.twitter.com/ErqruCeXBs
— BCCI (@BCCI) January 18, 2019
ఇప్పటికే భారత్ తరఫున టీ20లు ఆడిన విజయ్ శంకర్ ఈ మ్యాచ్తో వన్డేల్లోకి అంతర్జాతీయ అరంగేట్రం చేస్తున్నాడు. మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం కాగా.. మూడో వన్డేలో గెలిచిన జట్టు సిరీస్ విజేతగా నిలుస్తుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కోహ్లీసేన ఉంది.
మరోవైపు వన్డే సిరీస్నైనా నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని ఆతిథ్య ఆస్ట్రేలియా ఆరాటపడుతోంది. అంతకముందు జరిగిన టీ20 సిరీస్ను 1-1తో సమం చేసిన కోహ్లీసేన నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ను 2-1తో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), కేదార్ జాదవ్, ధోని, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, షమీ.
ఆస్ట్రేలియా: అలెక్స్ క్యారీ, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, హ్యాండ్స్కోంబ్, స్టొయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, ఆడమ్ జంపా, బిల్లీ స్టాన్లేక్, పీటర్ సిడ్డిల్, రిచర్డ్సన్