
హైదరాబాద్: టెస్టు హోదా దక్కించుకున్న తర్వాత ఎన్నో అంచనాలతో అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొట్టాలనుకున్న ఆప్ఘనిస్థాన్ కలలను భారత బౌలర్లు ఒక్కరోజులోనే ఆవిరి చేశారు. ఒకే రోజులో ఆప్ఘనిస్థాన్ జట్టుని రెండుసార్లు ఆలౌట్ చేసింది. దీంతో భారత బౌలర్ల ధాటికి టెస్టు అనుభవం లేని ఆప్ఘన్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు.
తద్వారా బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్తో జరిగిన చారిత్రాత్మక టెస్టులో టీమిండియా 262 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆటలో రెండో రోజైన శుక్రవారం తొలి సెషన్లో టీమిండియా 474 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం ఫాలోఆన్ ఆడి రెండో ఇన్నింగ్స్లోనూ 103 పరుగులకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్లో మహ్మద్ నబీ (24) టాప్ స్కోరర్గా నిలవగా, రెండో ఇన్నింగ్స్లో హస్మతుల్లా షాహిది (36: 88 బంతుల్లో 6 ఫోర్లు), కెప్టెన్ అస్గర్ (25) మాత్రమే ఫర్వాలేదనిపించారు.
మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి అశ్విన్ (5/59), జడేజా (5/35) కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలకపాత్ర పోషించారు. మొత్తంగా ఆప్ఘనిస్థాన్ అరంగేట్రం టెస్టు చేదు అనుభవాన్ని మిగిల్చిందనే చెప్పాలి. ఇటీవల టెస్టు హోదా దక్కించుకున్న అప్ఘన్కు ఇదే తొలి టెస్టుకాగా.. మ్యాచ్ని రెండు రోజుల్లోనే భారత్ ముగించింది. ఓపెనర్ శిఖర్ ధావన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
మ్యాచ్ వివరాలు:
తొలి ఇన్నింగ్స్:
టీమిండియా: 474 ఆలౌట్
ఆప్ఘనిస్థాన్: 109 ఆలౌట్
ఫాలోఆన్లో పడిన ఆప్ఘన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 103 పరుగులకే ఆలౌటైంది.
ఫలితం: టీమిండియా 262 పరుగుల తేడాతో భారీ విజయం
ఆప్ఘనిస్థాన్ 109 పరుగులకే ఆలౌట్
చారిత్రాత్మక టెస్టులో ఆప్ఘనిస్థాన్ చతికిలపడింది. తొలిరోజు బౌలింగ్లో కాస్త ఫరవాలేదనిపించగా, బ్యాటింగ్లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత బౌలర్ల దెబ్బకు ఆప్ఘనిస్థాన్ తన తొలి ఇన్నింగ్స్లో 27.5 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది.
ఆప్ఘన్ బ్యాట్స్మెన్లలో ఇన్నింగ్స్ లో మహమ్మద్ నబి చేసిన 24 పరుగులే టాప్స్కోర్ కావడం గమనార్హం. మహమ్మద్ షాహ్జాద్(14), రహమత్ షా(14), షాహిది(11), అస్గర్(11), ముజీబ్ రహమాన్(15) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. దీంతో ఆప్ఘనిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 365 పరుగులు వెనుకబడి ఫాలోఆన్లో పడింది.
భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్(4/27) తన స్పిన్ మాయాజాలంతో ఆప్ఘన్ బ్యాట్స్మెన్ను బెంబేలెత్తించగా... ఇషాంత్ శర్మ, జడేజా తలో 2, యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆప్ఘనిస్థాన్
బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆప్ఘనిస్థాన్ 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఆప్ఘనిస్థాన్ భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడుతోంది.
ఆప్ఘన్ ఓపెనర్ షహజాద్ (14) పరుగుల వద్ద రనౌట్ కాగా, ఆ తర్వాత స్వల్ప విరామాల్లో జావేద్ అహ్మదీ(1), రహ్మత్ షా(14), అఫ్సర్ జజాయ్(6), అస్గార్ స్టానిక్జాయ్(11) వికెట్లను కోల్పోయింది. దీంతో 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. అప్ఘన్ కోల్పోయిన ఐదు వికెట్లలో ఇషాంత్ శర్మ రెండు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్, అశ్విన్లు తలో వికెట్ తీశారు.
100 వికెట్ల క్లబ్లో ఉమేశ్ యాదవ్
బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్తో జరుగుతున్న చారిత్రాత్మక టెస్టులో టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరుపున టెస్టు క్రికెట్లో 100 వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఆప్ఘన్ బ్యాట్స్మన్ రహ్మాత్ షా(14) పరుగుల వద్ద ఎల్బీగా పెవిలియన్కు చేర్చడంతో ఉమేశ్ ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో 100 వికెట్ల క్లబ్లో చేరిన సందర్భంగా ఉమేశ్ యాదవ్కు జట్టులోని సహచర క్రికెటర్లు అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది.
టీమిండియా 474 ఆలౌట్
బెంగళూరు వేదికగా ఆప్ఘన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా 474 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 347/6తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా ప్రారంభంలోనే అశ్విన్ వికెట్ కోల్పోయింది. ఫలితంగా 369 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Match Scorecard | Day 1 Highlights
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాండ్యా తన కెరీర్లో మూడో హఫ్ సెంచరీని నమోదు చేయగా, అతడికి జడేజా తోడు జడేజా రాణించడంతో వీరిద్దరూ కలిసి ఎనిమిదో వికెట్కు 67 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో ఉమేష్ యాదవ్ (26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది.
టెస్టుల్లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేసిన పాండ్యా
బెంగళూరు వేదికగా ఆప్ఘన్తో జరుగుతున్న ఏకైక టెస్టులో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 97ఓవర్లో నబి వేసిన బంతిని బౌండరీకి తరలించి.. టెస్టుల్లో మూడో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అనంతరం 99.2 ఓవర్లో వఫాదర్ బౌలింగ్లో జుజైయ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అంతకముందు రవీంద్ర జడేజా(20) కాసేపు దూకుడుగా ఆడినా.. 98.5 ఓవర్లో నబి బౌలింగ్లో రహ్మత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరుకున్నాడు. దీంతో 100 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 440 పరుగులు చేసింది.
ఆరంభంలోనే అశ్విన్ ఔట్
బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్తో జరుగుతున్న చారిత్రాత్మక టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోరు 347/6తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 369 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది.
ఆఫ్ఘన్ బౌలర్ ఫాస్ట్ బౌలర్ అహ్మదజాయ్ ఆఫ్ స్టంప్కి వెలుపలగా విసిరిన బంతిని ప్లిక్ చేయబోయి రవిచంద్రన్ అశ్విన్ (18) వికెట్ కీపర్ జజాయ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం 89 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 389 పరుగులు చేసింది.
బ్యాట్కి ఇన్సైడ్ ఎడ్జ్లో తగిలిన బంతి నేలను తాకుతున్న ఆఖరి క్షణంలో కీపర్ అందుకోవడంతో.. క్యాచ్పై అనుమానం వ్యక్తం చేసిన ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కి నివేదించారు. రిప్లైలో కీపర్ సేఫ్గానే బంతిని అందుకున్నట్లు తేలింది. దీంతో అశ్విన్ నిరాశగా పెవిలియన్కు చేరాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా క్యాచ్ని కీపర్ నేలపాలు చేశాడు. కాగా, తొలి రోజు ఆట ముగిసే సయమానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్లు మంచి ఆరంభాన్ని అందించారు.
ఓపెనర్లు ఇద్దరూ శిఖర్ ధావన్ (107), మురళీ విజయ్ (105) సెంచరీలతో చెలరేగగా... కేఎల్ రాహుల్ (54) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.