హైదరాబాద్: సాహా స్థానంలో కీపింగ్ చేసేందుకైనా సిద్ధమేనంటున్నాడు కేఎల్ రాహుల్. అఫ్గానిస్థాన్తో జూన్ 14 నుంచి బెంగళూరు వేదికగా జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్కు సాహా అందుబాటులో ఉంటాడనేది సందేహం. ఈ క్రమంలో వికెట్ కీపింగ్ చేసేందుకు తాను సిద్ధమని భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా.. ఫైనల్కి ముందు గాయపడిన విషయం తెలిసిందే.
మ్యాచ్ జరుగుతుండగా అతని కుడిచేతి బొటనవేలు విరగడంతో ఆరోగ్యం సహకరించకపోవచ్చని బీసీసీఐ వెల్లడించింది. అయితే.. సాహా స్థానంలో జట్టులోకి దినేశ్ కార్తీక్, పార్థీవ్ పటేల్, రిషబ్ పంత్లో ఎవరో ఒకరిని తీసుకుంటారనే వివరాలు స్పష్టం చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా జట్టు మేనేజ్మెంట్ కోరితే తాను వికెట్ కీపింగ్ చేసేందుకు సిద్ధమని కేఎల్ రాహుల్ వెల్లడించాడు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో ఓపెనర్/ వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. 'భారత జట్టు మేనేజ్మెంట్ కోరితే వికెట్ కీపింగ్, బ్యాట్స్మెన్గా రెండు బాధ్యతలు స్వీకరించేందుకు నేను సిద్ధమే. జట్టులో రెండు పాత్రలు పోషించేందుకు కొంతకాలంగా చాలా శ్రమించాను. కీపింగ్/బ్యాటింగ్ బాధ్యతలతో నా శరీరంపై అదనపు భారం పడుతుందని తెలుసు. కానీ.. ఏడాదంతా ఇలా రెండు బాధ్యతలు నిర్వహించం కదా..? ఎప్పుడో జట్టుకి అవసరమైనప్పుడు మాత్రమే కాబట్టి.. నిరభ్యంతరంగా స్వీకరిస్తా' అని కేఎల్ రాహుల్ వెల్లడించాడు.
గత ఏడాది భుజం గాయం కారణంగా ఐపీఎల్కి దూరమైన కేఎల్ రాహుల్.. ఈ ఏడాది టోర్నీ ఆరంభం నుంచి పరుగుల మోత మోగించాడు. అతను తానాడిన 14 మ్యాచ్ల్లో ఏకంగా 659 పరుగులు చేసి.. సీజన్ టాప్ స్కోరర్ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ప్రతి మ్యాచ్ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాహుల్ కొన్ని సార్లు మ్యాచ్ ఓటమిపై భావేద్వేగానికి సైతం లోనైయ్యాడు.