రెండు మ్యాచ్ల వ్యవధిలోనే..
అయితే రెండు మ్యాచ్ల వ్యవధిలోనే బుమ్రా ఇలా తీవ్రంగా గాయపడటం అనేక సందేహాలకు తావిస్తుంది. అసలు బుమ్రా గాయపడటానికి అసలు కారణం బీసీసీఐతో పాటు టీమ్మేనేజ్మెంట్ అత్యుత్సాహమనే చర్చ తెరపైకి వచ్చింది. మెగా టోర్నీ కోసం సెలెక్టర్లు, టీమ్మేనేజ్మెంట్ తొందరపడటంతోనే బుమ్రా సేవలు కోల్పోవాల్సి వచ్చిందనే అభిప్రాయం వినిపిస్తోంది. జూలైలో ఇంగ్లండ్ పర్యటన అనంతరం విశ్రాంతి పేరిట ఆటకు దూరమైన బుమ్రా.. వెస్టిండీస్తో టీ20 సిరీస్తో పాటు వన్డే సిరీస్కు దూరంగా ఉన్నాడు. జింబాబ్వే పర్యటనకు వెళ్లలేదు. ఆసియాకప్లో ఫ్రెష్గా ఆడించాలనే ప్రణాళికతో టీమ్మేనేజ్మెంట్ అతనికి కావాల్సినంత విశ్రాంతినిచ్చింది.
బీసీసీఐ తొందరపాటు..
అయితే బ్రేక్లో ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఆసియాకప్ ముంగిట బుమ్రా వెన్ను నొప్పితో బాధపడ్డాడు. వెంటనే బెంగళూరులోని ఎన్సీఏకు వెళ్లి రిహాబిలిటేషన్ తీసుకున్నాడు. మెగా టోర్నీ నేపథ్యంలో బీసీసీఐ సైతం ఆసియా కప్ నుంచి అతనికి విశ్రాంతిని కల్పించింది. అయితే ఆసియాకప్లో భారత్ ఘోరంగా విఫలమవ్వడం... బౌలింగ్ విభాగం మరీ బలహీనంగా మారడంతో బుమ్రాను తీసుకొచ్చేందుకు సెలెక్టర్లు, టీమ్మేనేజ్మెంట్ తొందరపడ్డారు. ఈ క్రమంలోనే అతను పూర్తిగా కోలుకోకముందే మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఆడించాలని ఆస్ట్రేలియాతో సిరీస్కు ఎంపిక చేశారు.
పూర్తిగా కోలుకోక ముందే..
పూర్తిగా కోలుకోకపోవడంతో తొలి మ్యాచ్కు పక్కనపెట్టి రెండో మ్యాచ్ ఆడించారు. ఈ మ్యాచ్లో రెండు ఓవర్లు వేసిన బుమ్రా.. ఓ వికెట్ తీసి రిథమ్లో కనిపించాడు. అయితే పూర్తిగా గాయం నుంచి కోలుకోకపోవడంతో వెన్నులో మరింత ఒత్తిడి పెరిగి ఫ్రాక్చర్కు దారితీసింది. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో ఈ విషయం స్పష్టమైంది. బౌలింగ్ చేయడంలో అసౌకర్యంగా కనిపించిన బుమ్రా ఈ మ్యాచ్లో తేలిపోయాడు. కెరీర్లో ఎన్నడు లేనివిధంగా ధారళంగా పరుగులిచ్చి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇక సౌతాఫ్రికాతో తొలి టీ20కి ముందు వెన్ను నొప్పి వస్తుందని చెప్పడంతో విశ్రాంతినిచ్చారు. తీరా గాయం తీవ్రత ఎక్కువ అవడంతో సిరీస్లోని మిగతా రెండు మ్యాచ్లతో పాటు మెగా టోర్నీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే బీసీసీఐ తొందరపాటు వల్లే బుమ్రా సేవలు కోల్పోవాల్సి వచ్చిందనేది స్పష్టంగా తెలుస్తోంది.