
హైదరాబాద్: బౌండరీ అయితే పరవాలేదు. కానీ, సింగిల్స్ తీయాలంటే వీళ్లకి భయం. చాలావరకు పరవాలేదనుకుంటేనే రన్స్ చేయడానికి సిద్ధమవుతారు రోహిత్, ధావన్. శనివారంతో ముగిసిన దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లలో అతను రెండు సార్లు ఇలానే తడబడుతూ పేలవ రీతిలో రనౌటయ్యాడు. ముఖ్యంగా షాట్ కొట్టిన తర్వాత బంతి గమనాన్ని పసిగట్టలేకపోవడమే దీనికి కారణం.
దక్షిణాఫ్రికాతో శనివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్లోనూ శిఖర్ ధావన్ ఇదే తరహాలో తడబడ్డాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన స్పిన్నర్ షంసీ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ దిశగా బంతిని తరలించిన శిఖర్ ధావన్ (47: 40 బంతుల్లో 3x4) తొలి పరుగు పూర్తి చేసి.. రెండో పరుగు కోసం ప్రయత్నిస్తూ రనౌటయ్యాడు. ఇక్కడ రెండో పరుగుకి అవకాశం ఉన్నా.. ధావన్ వేగంగా పరుగెత్తలేకపోయాడు.
సాధారణంగా బ్యాట్స్మెన్ షాట్ కొట్టిన వెంటనే బంతి దూరం వెళ్తుండగానే.. పరుగులు చేయడం మొదలుపెడతారు. లేదంటే వెనక్కి వచ్చేస్తాడు. కానీ.. ధావన్ దీనికి పూర్తిగా విరుద్ధంగా ముందుకు వెనక్కి ఆలోచిస్తూ ఆడుగులేసి అవుటవుతున్నాడు. అతను బంతిని చూసిన తర్వాత.. పరుగు కోసం ప్రయత్నిస్తాడు. దీంతో నాన్స్ట్రైక్ ఎండ్లోని బ్యాట్స్మెన్ సగం దూరం వచ్చే వరకూ ధావన్ క్రీజులోనే ఉండిపోతున్నాడు.
శనివారం మ్యాచ్లోనూ అలాగే జరిగింది. పరుగుని ఆలస్యంగా ఆరంభించాడు. దీంతో.. డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ జూనియర్ డాలా నేరుగా బంతిని వికెట్లపైకి విసరడంతో ధావన్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. తొలి వన్డేలో సైతం ఇదే తరహాలో కోహ్లి దాదాపు సగం దూరం వచ్చే వరకూ ధావన్ క్రీజులో ఉన్నాడు. ఆ మ్యాచ్ లోనూ రనౌట్ అయ్యాడు.