
హైదరాబాద్: అందిన దానితో ఆనందపడి పక్కన వాళ్లు పాడైపోతున్నా పట్టించుకోని జనరేషన్లో ద్రవిడ్ సమన్యాయం అంటూ బీసీసీఐని కోరాడు. అంతే నజరానా షురూ అయిపోయింది. అవును టీమిండియా అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన వేళ బీసీసీఐ నజరానాలు ప్రకటించింది. ప్రధాన కోచ్ ద్రవిడ్కు రూ. 50 లక్షలు, ఆటగాళ్లకు రూ.30 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.20 లక్షల చొప్పున ప్రోత్సాహకంగా ఇస్తామని బోర్డు ఆ సమయంలో స్పష్టం చేసింది.
ఆ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ద్రవిడ్ .. ప్రపంచకప్ విజయంలో అందరిదీ సమాన పాత్ర అన్నాడు. తనకు ఎక్కువ మొత్తంలో ఇవ్వడం, మిగిలిన వారిని తక్కువ చేయడం సబబు కాదంటూ మండిపడ్డాడు. అంతేగాక, ద్రవిడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. బీసీసీఐ ఆలోచనలో పడింది. అందరికీ సమానంగా రూ. 25 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
గతేడాది మరణించిన వారికి సైతం:
అంతే కాదు.. ద్రవిడ్ చొరవ వల్ల గతేడాది మరణించిన టీమ్ ట్రైనర్ రాజేష్ సావంత్ కుటుంబానికి ఆర్థిక సాయం అందనుంది. భారత కుర్రాళ్లు వరల్డ్ కప్ నెగ్గడంతో అతడికి కూడా బీసీసీఐ ప్రోత్సాహకం ప్రకటించింది.
బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రితో మాట్లాడిన రాహుల్.. జట్టు విజయం సాధించడానికి ఏడాదిపాటు కష్టించామని చెప్పాడు. అందుకే ప్రస్తుతం జట్టుతోపాటు లేనప్పటికీ.. అండర్-19 జట్టు విజయం కోసం తమ వంతు కృషి చేసిన పాత సిబ్బందికి కూడా నజరానా ఇవ్వాలని కోరాడు.
ఎవరెవరికి వచ్చిందో తెలుసా:
దీంతో ఇంగ్లాడ్ పర్యటనలో జట్టుకు కోచ్గా వ్యవహరించిన డబ్ల్యూవీ రామన్, లాజిస్టిక్స్ మేనేజర్లు మనూజ్ శర్మ, సుమీత్ మలహపూర్కర్, ట్రైనర్ అమోఘ్ పండిట్లతోపాటు రాజేష్ సావంత్ కుటుంబీలకు కూడా లబ్ధి చేకూరనుంది. ద్రవిడ్తో పాటుగా ప్రస్తుతం జట్టుతో ఉన్న బౌలింగ్ కోచ్ పరాస్ మహంబ్రే, ఫీల్డింగ్ కోచ్ అభయ్ శర్మ, ఫిజియోథెరపిస్ట్ యోగేష్ పర్మార్, ట్రైనర్ ఆనంద్ డేట్, వీడియో అనలిస్ట్ దేవ్రాజ్ రౌత్, మసాజర్ మంగేష్ గైక్వాడ్లు రూ. 25 లక్షలు తీసుకోనున్నారు.