
హైదరాబాద్: కొత్త నిబంధనల ప్రకరాం క్రికెటర్ల జీతాలు పెంచడంతో పాటు బీసీసీఐ మరికొన్ని ప్రతిపాదనలు చేసింది. విదేశీ పర్యటనల్లో స్థానిక పరిస్థితులకు భారత ఆటగాళ్లు అలవాటు పడేందుకు కాస్త ఎక్కువ సమయం పడుతుండటంతో కొత్త ప్రణాళిక రూపొందించింది. ముందుస్తుగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడించాలని తద్వారా బయట పిచ్లలో ఆడేటప్పుడు సునాయాసంగా అలవాటుపడతారనే ఉద్దేశ్యంతో బీసీసీఐ ఇలా నిర్ణయించింది.
దీనిలో భాగంగా భవిష్యత్ పర్యటనల షెడ్యూల్లో మార్పులు కూడా చేయనుంది. ఇటీవల సౌతాఫ్రికా పర్యటనలో ఎలాంటి ప్రాక్టీస్, వార్మప్ మ్యాచ్లు ఆడకుండానే టెస్టు సిరీస్ ఆరంభించడంతో టీమిండియా తడబడిన విషయం తెలిసిందే. టెస్టు సిరీస్ను భారత్ 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. టెస్టుల నుంచి పాఠాలు నేర్చుకున్న తరువాత జరిగిన వన్డే, టీ20 సిరీస్లను కోహ్లీసేన కైవసం చేసుకుంది.
ఈ నేపథ్యంలో విదేశీ టూర్లలో టెస్టు సిరీస్లో పాల్గొనేముందు పరిమిత ఓవర్ల క్రికెట్తో పర్యటనను ఆరంభించనుంది. త్వరలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టూర్లలో కూడా అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు టెస్టుల కన్నా ముందే వన్డేలు, టీ20లు ఆడుతుందని బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ తెలిపారు. టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని దీనిపై సుధీర్ఘంగా చర్చించినట్లు ఆయన తెలిపారు.
బీసీసీఐ సంబంధిత అదికారి ఒకరు మీడియాతో.. భవిష్యత్ పర్యటనలను ఉద్దేశించుకొని బీసీసీఐ చేసిన కొత్త ప్రతిపాదనలు 2019-2023 సమయానికి అందుబాటులోకి రానున్నాయి. మొట్ట మొదటి సారిగా బీసీసీఐ భారత జట్టు ప్రణాళికలను తేదీలతో సహా సుస్పష్టంగా షెడ్యూల్ ను ప్రకటించనుంది' అని వివరించారు.