అసలేం జరుగుతుందో:
యూఏఈ వేదికగా ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ ఐదోసారి విజేతగా నిలిపాడు. అనంతరం హిట్మ్యాన్.. టీమిండియాతో ఆస్ట్రేలియాకు వెళ్లకుండా భారత్కు తిరిగి వచ్చాడు. తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్ ఎన్సీఏలో కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రోహిత్ శర్మ పీటీఐతో మాట్లాడాడు. 'అసలేం జరుగుతుందనే విషయంపై నాకు స్పష్టత లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలియదు. నేనొక విషయం చెప్పదల్చుకున్నా. నేను నిరంతరం బీసీసీఐ, ముంబై ఇండియన్స్తో చర్చలు జరుపుతున్నా. లీగ్ దశలో గాయపడిన తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెడతానని మా జట్టుకు చెప్పాను. ఆ విషయంలో స్పష్టత వచ్చాక పరుగులు చేయడంపై దృష్టి సారించాను' అని రోహిత్ చెప్పాడు.
నన్ను వేలెత్తి చూపొద్దు:
'ఇప్పుడు తొడ కండరాల గాయం నుంచి కోలుకున్నా. ఇప్పుడిప్పుడే మరింత ఫిట్నెస్ సాధిస్తున్నా. టెస్టు సిరీస్ ఆడకముందే పూర్తి ఫిట్నెస్ సాధించాననే నమ్మకం కలగాలి. ఎందుకంటే.. ఏ విషయంలోనూ నన్ను వేలెత్తి చూపొద్దని అనుకుంటున్నా. అందుకే ఇప్పుడు ఎన్సీఏలో ఉన్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరేం అనుకున్నా పట్టించుకోను. 25 రోజుల పాటు పూర్తిస్థాయిలో కోలుకొని టెస్టు సిరీస్కు సిద్ధమవ్వాలనుకుంటున్నా. విషయంలో ఎందుకింత దుమారం రేగిందో అర్థం కావడం లేదు' అని అని రోహిత్ శర్మ అన్నాడు.
రాత్రికి రాత్రే విజయవంతమైన జట్టు కాలేదు:
'ముంబై ఇండియన్స్ రాత్రికి రాత్రే విజయవంతమైన జట్టు కాలేదు. దానికంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. మూడేళ్లుగా జట్టుకు కష్టపడ్డాం. ఇక జట్టు యాజమాన్యం కూడా మమ్మల్ని నమ్మింది. దాంతో ఒక బలమైన బృందాన్ని నిర్మించాం. ఈ సీజన్లో అందరూ బాగా ఆడారు. సమిష్టి కృషి వల్లే టైటిల్ సాధించాం. అద్భుతంగా బౌలింగ్ చేసిన ట్రెంట్ బౌల్ట్ జట్టులో ఉండడం మా అదృష్టం. అతడు గతేడాది ఢిల్లీ తరఫున ఆడాడు. 2020 వేలంలో ఆ ఢిల్లీ వదిలేయడంతో మేం కొనుగోలు చేశాం. అతడి ఎంపిక పట్ల గర్వంగా ఉన్నా' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
ఎప్పటికైనా సూర్య భారత జట్టులో ఆడతాడు:
సూర్యకుమార్ యాదవ్ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయనప్పుడు అతడే వచ్చి తనతో మాట్లాడాడని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ గుర్తుచేసుకున్నాడు. ఆ విషయాన్ని వదిలేసి ముంబైకి మ్యాచ్లు గెలిపిస్తానని తనతో అన్నట్లు కూడా చెప్పాడు. దాంతో సూర్యకుమార్ సరైన మార్గంలో పయనిస్తున్నాడని అనిపించిందని తెలిపాడు. ఎప్పటికైనా అతడు భారత జట్టులో ఆడతాడనే నమ్మకం తనకు ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు.