
హైదరాబాద్: భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఈ రికార్డు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్ట్స్ పేరిట ఉంది.
చార్లెట్ ఎడ్వర్ట్స్ అత్యధికంగా 191 వన్డేలాడిన ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు మిథాలీ రాజ్.. ఎడ్వర్ట్స్ను దాటి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. నాగ్పూర్ వేదికగా ఇంగ్లాండ్-భారత మహిళల జట్టు తొలి వన్డే మ్యాచ్ శుక్రవారం ప్రారంభమైంది.
ఈ మ్యాచ్ మిథాలీ రాజ్కు 192వ మ్యాచ్ కావడం విశేషం. తద్వారా అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. 1999 జూన్లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో మిథాలీ రాజ్ తన అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసింది.
తన తొలి వన్డేలోనే మిథాలీ రాజ్ 114 పరుగులతో నాటౌట్గా నిలిచింది. ఇప్పటివరకు 192 వన్డేలాడిన మిథాలీ రాజ్ 6,295 పరుగులు చేసింది. అదే సమయంలో మిథాలీరాజ్ 10 టెస్టులు, 72 టీ20 మ్యాచ్లాడింది. అంతేకాదు 10 ఇన్నింగ్స్ల్లో బౌలింగ్ చేసి 8 వికెట్లు పడగొట్టింది.
దీంతో పాటు మహిళల వన్డే క్రికెట్లో 6వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి క్రికెటర్గా అంతకముందు మిథాలీ రాజ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. భారత మహిళల జట్టుని రెండుసార్లు భారత జట్టును వరల్డ్ కప్ ఫైనల్కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్ మిథాలీ రాజ్.