న్యూజిలాండ్ ఓడితేనే:
టీ20 ప్రపంచకప్ 2021లోని గ్రూప్- 2 నుంచి పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్ చేరుకోగా.. మరో స్థానం కోసం భారత్తో పాటు న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ పోటీపడుతున్నాయి. పాక్ ఆడిన నాలుగు మ్యాచుల్లో నాలుగు గెలిచి 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. నాలుగు మ్యాచ్ల్లో మూడు గెలిచిన కివీస్.. ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక నాలుగు మ్యాచ్ల్లో రెండేసి విజయాల చొప్పున సాధించిన భారత్, అఫ్గానిస్థాన్ జట్లు చెరో 4 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సెమీస్ చేరే అవకాశం కివీస్కే మెండుగా ఉంది. న్యూజిలాండ్ తన చివరి గ్రూపు మ్యాచ్లో ఆదివారం (నవంబర్ 7) అఫ్గానిస్థాన్తో తలపడుతుంది. ఈ మ్యాచులో విజయం సాధిస్తే.. మిగతా సమీకరణాలతో సంబంధం లేకుండా కివీస్ సెమీస్కు వెళ్తుంది.ఒకవేళ ఆఖరి మ్యాచ్లో అఫ్గానిస్థాన్ గెలిస్తే.. న్యూజిలాండ్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అది టీమిండియాకు కలిసిరానుంది.
ఏం జరుగుతుందో చూడాలి:
స్కాట్లాండ్ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ... 'ఇది సంపూర్ణ ఆధిపత్యం. ఇలాంటి ప్రదర్శనే మరోసారి చేయాలనుకుంటున్నాం. ఇక ఆదివారం (నవంబర్ 7) ఏం జరగబోతుందనేది ఆసక్తిగా మారింది. ఆ మ్యాచ్ ఎలా సాగుతుందో చూడాలి. ఈ రోజు ఆట గురించి పెద్దగా చెప్పాలని లేదు. మేం ఏం చేయగలమో మాకు తెలుసు. అలాగే దుబాయ్ వేదికపై టాస్ ఎంత కీలకమో కూడా చూడాలనుకుంటున్నాం. స్కాట్లాండ్ను 110 లేదా 120లోపు కట్టడి చేయాలనుకున్నాం. బౌలర్లు బాగా రాణించారు' అని అన్నాడు. రవీంద్ర జడేజా (3/15), మహమ్మద్ షమీ (3/15), జస్ప్రీత్ బుమ్రా (2/10) సత్తాచాటిన విషయం తెలిసిందే.
ఆ రెండు మ్యాచ్ల్లోనే కుదరలేదు:
'లోకేష్ రాహుల్ బాగా ఆడాడు. ఇక ఛేదనలో మేం 8-10 ఓవర్ల మధ్య లక్ష్యాన్ని పూర్తి చేయాలని చూశాం. రోహిత్ శర్మ, రాహుల్ నిలకడగా ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయని అనుకున్నాం. రెచ్చిపోయి ఆడాలని అసలు అనుకోలేదు. ఎందుకంటే అలాంటి సమయంలో రెండు మూడు వికెట్లు పడ్డా.. ఆట మరో మూడు ఓవర్లు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. మేం ప్రాక్టీస్ సెషన్లోనూ ఇలాగే ఆడాం. మా సహజమైన ఆట కూడా ఇలాగే ఉంటుంది. కానీ ఆ రెండు మ్యాచ్ల్లోనే (పాకిస్తాన్, న్యూజీలాండ్ మ్యాచ్లు) కుదరలేదు. పాకిస్తాన్, న్యూజీలాండ్ జట్లు బౌలింగ్ అద్భుతంగా చేసి మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టాయి' అని విరాట్ కోహ్లీ తెలిపాడు. లోకేశ్ రాహుల్ (19 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (16 బంతుల్లో 30; 5 ఫోర్లు, ఒక సిక్సర్) ఆకాశమే హద్దుగా చెలరేగారు.
అనుష్క, వామికా ఉంటే చాలు:
ఇక తన పుట్టిన రోజు వేడుకలపై మాట్లాడిన విరాట్ కోహ్లీ.. తాను సెలబ్రేట్ చేసుకునే దశ దాటిపోయానని చెప్పాడు. తన కుటుంబం పక్కనే ఉంటే చాలని, ఇప్పుడు బయోబబుల్ లాంటి పరిస్థితుల్లో అనుష్క శర్మ, వామికా తనతో ఉన్నారని సంతోషం వ్యక్తం చేశాడు. అదే తనకు సెలబ్రేషన్స్ లాంటిదని కోహ్లీ తెలిపాడు. భారత్ బాగా ఆడిందని, ప్రతి ఒక్కరూ తనకు శుభాకాంక్షలు చెప్పారన్నాడు. శుక్రవారం కోహ్లీ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే.