IND vs SA: మీ అరుపులకు గుండె పోటు వచ్చేలా ఉందయ్యా.. టీమిండియా ఆటగాళ్లపై అంపైర్ అసహనం (వీడియో)

జోహన్నెస్బర్గ్: భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది. మూడు రోజుల ఆట అనంతరం ఇరు జట్లను విజయం వరిస్తుంది. మరో 8 వికెట్లు తీస్తే టీమిండియా అద్భుత విజయంతో చరిత్ర సృష్టించనుండగా.. సౌతాఫ్రికా గెలవాలంటే మరో 122 పరుగులు చేయాలి. అదే జరిగితే మూడు టెస్ట్ల సిరీస్ 1-1తో సమం అవుతుంది. సిరీస్ ఫలితం కోసం కేప్టౌన్ టెస్ట్ వరకు వేచిచూడాల్సి ఉంటుంది. అయితే మ్యాచ్ ఫలితాన్ని తేల్చే నాలుగో రోజు ఆట ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం జోహన్నెస్బర్గ్లో వర్షం పడుతుండటంతో గురువారం ఆటకు ఆంటకం ఏర్పడింది. ఇప్పటికే ఫస్ట్ సెషన్ తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది.
గుండె పోటు వచ్చేలా ఉందిరా అయ్యా..
అయితే మూడో రోజు ఆటలో టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి ఫీల్డ్ అంపైర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా శార్దూల్ ఠాకూర్ వేసిన 10వ ఓవర్లో ఫీల్డ్ అంపైర్ మరియాస్ ఎరాస్మస్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఈ ఓవర్లో భారత ఆటగాళ్లు పదేపదే అప్పీల్ చేయడంతో చికాకుకు గురయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశించి.. 'మీ అరుపులకు నాకు గుండెపోటు వచ్చేలా ఉంది. ప్రతీ ఓవర్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారు.' అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలు స్టంప్స్ మైక్లో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

బుమ్రా X జాన్సెన్ డిష్యూం డిష్యూం
ఇక భారత ఇన్నింగ్స్ సందర్భంగా సౌతాఫ్రికా యువ పేసర్ మార్కో జాన్సెన్, జస్ప్రీత్ బుమ్రా మధ్య మాటల యుద్దం నడవగా.. అంపైర్ ఎరాస్మసే అడ్డుకున్నాడు. పదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన జస్ప్రీత్ బుమ్రాకి జాన్సెన్ వరుసగా షార్ట్ పిచ్ బంతుల్ని సంధించాడు. ఈ క్రమంలో ఓ బంతి బుమ్రా భుజానికి బలంగా తాకింది. దాంతో.. జాన్సన్ బుమ్రాను వెక్కిరిస్తూ నోరుపారేసుకున్నాడు. ఆ తర్వాత బంతిని కూడా షార్ట్ పిచ్ రూపంలో విసిరాడు. అయితే దాన్ని ఫుల్ షాట్ ఆడబోయిన బుమ్రా మరోసారి విఫలమయ్యాడు. దాంతో.. జాన్సన్ మరోసారి నోరు జారాడు. ఇక ఈసారి సహనం కోల్పోయిన బుమ్రా.. యువ పేసర్కు తన విశ్వరూపం చూపించాడు. మాటకి మాట బదులిస్తూ నీ అవ్వ తగ్గేదేలే అంటూ క్రీజు నుంచి ముందుకు వచ్చాడు. జాన్సెన్ కూడా బదులివ్వడంతో గొడవ పెద్దదయింది. దాంతో అంపైర్ ఎరాస్మసే సర్ధిచెప్పాడు.

గెలుపు నీదా? నాదా?
ఈ మ్యాచ్లో భారత్ జట్టు సౌతాఫ్రికాకు 240 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. దీనిని అందుకునే ప్రయత్నంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (121 బంతుల్లో 2 ఫోర్లతో 46 బ్యాటింగ్), డసెన్ (11 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 85/2తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌటైంది. అజింక్యా రహానే (78 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 58), చతేశ్వర్ పుజారా (86 బంతుల్లో10 ఫోర్లతో 53) అర్ధ సెంచరీలు చేయగా, హనుమ విహారి (84 బంతుల్లో 6 ఫోర్లతో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 202 ఆలౌట్ (కేఎల్ రాహుల్ 50, రవిచంద్రన్ అశ్విన్ 46, మార్కో జాన్సెన్ 4/31)
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 229 ఆలౌట్( కీగన్ పీటర్సన్ 62, శార్దూల్ ఠాకూర్ 7/61)
భారత్ రెండో ఇన్నింగ్స్: 266 ఆలౌట్( రహానే 58, పుజారా 53, లుంగి ఎంగిడి 3/43)
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 118/2(డీన్ ఎల్గర్(46 బ్యాటింగ్))
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications