IND vs SA: భారత క్రికెటర్లకు ఉగ్ర ముప్పు.. విశాఖలో హై అలర్ట్!!

విశాఖ: భారత క్రికెటర్లకు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్టు ఇంటెలిజెన్స్ తాజాగా హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లపై దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ వచ్చిన ఓ ఈ మెయిల్ అధికారులను హడలెత్తిస్తోంది. టీమిండియాతో పాటు దక్షిణాఫ్రికా క్రికెటర్లకు కూడా ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉంది. ఇరు జట్ల క్రికెటర్లకు ముప్పు పొంచి ఉందంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో వారి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

విశాఖలో హై అలర్ట్:
ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ స్టేడియంలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టేడియం చుట్టుపక్కల, ఆటగాళ్ల హోటల్ పరిసరాల్లో, రోడ్డు మార్గాన భద్రతా సిబ్బంది మోహరించి ఉన్నారు. మరోవైపు విశాఖ తీరంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కోస్ట్గార్డ్, నేవీలతో మెరైన్ పోలీసులు పర్యవేక్షణ చేపట్టారు. విశాఖ తీరం వెంబడి పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం టెస్ట్ ముగిసిన కారణంగా.. పుణేలో ఈ నెల 10 నుండి రెండో మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆటగాళ్లు త్వరలో విశాఖను వీడనున్నారు.

ఆదిలోనే షాక్:
మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. పేసర్ మహ్మద్ షమీ, స్పిన్నర్ రవీంద్ర జడేజా పోటీపడి వికెట్లు తీయడంతో 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 63.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ అయింది. 11/1 ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్లోనే డిబ్రుయిన్ (10)ను రవిచంద్రన్ అశ్విన్ బౌల్డ్ చేసాడు. ఇక ఆ తర్వాతి ఓవర్లో పేసర్ మహ్మద్ షమీ ..తెంబ బువుమా (0)ను పెవిలియన్ చేర్చాడు. పిచ్ నుంచి బౌన్స్, స్వింగ్ రాబడుతూ మరింత రెచ్చిపోయిన షమీ.. 40 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను తీసి దక్షిణాఫ్రికా టాపార్డర్ వెన్నువిరిచాడు. డుప్లెసిస్ (13), డీకాక్ (0)లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

70 పరుగులకే 8 వికెట్లు:
మరోవైపు రవీంద్ర జడేజా తన స్పిన్ మాయాజాలం చూపించాడు. బంతిని రెండు వైపులకు తిప్పుతూ సఫారీలను ముప్పుతిప్పలు పెట్టాడు. 10 పరుగుల వ్యవధిలో మార్కరమ్ (39),ఫిలిండర్ (0), మహరాజ్ (0)లను పెవిలియన్కు పంపాడు. దీంతో సఫారీలు 70 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఒక్కసారిగా పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. అయితే సేనురాన్ ముత్తుసామి, డేన్ పీడ్ట్ ఆదుకునే ప్రయత్నం చేశారు. లంచ్ సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.

91 పరుగుల భాగస్వామ్యం:
లంచ్ అనంతరం కూడా ముత్తుసామి, డేన్పీట్ అద్భుత పోరాటం చేశారు. ఈక్రమంలోనే డేన్పీట్ (56) హాఫ్ సెంచరీ చేసాడు. అంతేకాదు వీరిద్దరు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ప్రొటీస్ స్కోర్ బోర్డు ముందుకు సాగింది. అయితే హాఫ్ సెంచరీ చేసిన డేన్పీట్ను షమీ బోల్డ్ చేసాడు. దీంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. డేన్పీట్ ఔటైన తర్వాత కగిసో రబడా (18) క్రీజ్లో నిలవలేదు. రబడాను షమీ ఔట్ చేసి భారత్కు విజయం ఖాయం చేశాడు. రెండో ఇన్నింగ్స్లో షమీ ఐదు వికెట్లు తీయగా.. జడేజా నాలుగు వికెట్లు సాధించాడు. అశ్విన్కు వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications