హైదరాబాద్: విదేశాల్లో అద్భుత ప్రదర్శనతో నిరూపించుకున్న భారత బ్యాట్స్మన్ హనుమ విహారి సొంతగడపై తొలి టెస్ట్ ఆడనున్నాడు. మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా అక్టోబర్ 2న విశాఖపట్నంలో దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరిగే తొలి టెస్టు విహారికి భారత దేశంలో మొదటి మ్యాచ్. అంతేకాదు సొంతగడపై కూడా తొలి టెస్ట్ మ్యాచ్. సొంత అభిమానుల మధ్య టెస్ట్ మ్యాచ్ ఆడనున్నడంతో విహారి తబ్బిబ్బవుతున్నాడు. విశాఖలో మ్యాచ్ ఆడబోతుండడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
గంబీర్ ఫైర్.. ధోనీ ఇష్టమైన సిరీసులే ఆడతానంటే కుదరదు!!
గతేడాది సెప్టెంబర్లో ఇంగ్లండ్పై హనుమ విహారి అరంగేట్రం చేసాడు. విహారి ఇప్పటివరకు ఆరు టెస్టులు ఆడాడు. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో తొలి టెస్ట్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో దక్షిణాఫ్రికా సిరీస్కు విహారీ సిద్దమవుతున్నాడు. హనుమ విహారిని హైదరాబాద్లో అతను ఓనమాలు నేర్చిన సెయింట్ జాన్స్ అకాడమీ గురువారం ఘనంగా సత్కరించింది.
తొలి టెస్ట్ సెంచరీ సాధించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ వ్యక్తిగతంగా విహారికి ప్రత్యేక బహుమతిగా కారును అందజేశారు. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్తో పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ఏఐ హర్ష కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విహారి మాట్లాడాడు. 'టీమిండియా కోసం భారతదేశంలో మొదటిసారి నేను అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నా. ఇది చాలా సంతోషంగా ఉంది. అది కూడా వైజాగ్లో ఆడడం నాకు మాటలు రావడం లేదు. ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నా. గత 15 రోజులుగా నేను ఎన్సీఏలో ఉన్నా. దక్షిణాఫ్రికా సిరీస్కు సిద్ధమవుతున్నా. తొలి సెంచరీ ఎప్పటికి ప్రత్యేకమే. ఆ సెంచరీ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. దక్షిణాఫ్రికా సిరీస్లో కూడా అదే జోరు కొనసాగిస్తా' అని విహారి ధీమా వ్యక్తం చేసాడు.
'ఇదో భావోద్వేగమైన రోజు. నాకు 12 ఏళ్లున్నప్పుడు మా నాన్న చనిపోయారు. అంతర్జాతీయ క్రికెట్లో నమోదు చేసే తొలి సెంచరీని ఆయనకు అంకితం ఇవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నా సంతోషించి ఉంటారు' అని తొలి టెస్ట్ చేసిన రోజు విహారి పేర్కొన్నాడు.