IND vs NZ:భారత్.. సిరీస్ గెలవాలంటే ఈ తప్పిదాలను సరిదిద్దుకోవాల్సిందే!

అహ్మదాబాద్: ఈ ఏడాది వరుసగా మూడు సిరీస్లు గెలిచిన టీమిండియా.. నాలుగో విజయంపై కన్నేసింది. న్యూజిలాండ్తో మూడు టీ20ల సిరీస్కు అడుగు దూరంలో నిలిచింది. వరుసగా మూడు సిరీస్ల్లో ఆధిపత్యం చెలాయించిన భారత జట్టుకు.. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో మాత్రం అనూహ్య ప్రతిఘటన ఎదురైంది.
చెత్త బౌలింగ్, పేలవ బ్యాటింగ్తో తొలి టీ20లో ఓడిన హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా.. రెండో టీ20లో చెమటోడ్చి నెగ్గింది. దాంతో బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న చివరి మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టునే సిరీస్ వరించనుంది. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలంటే టీమిండియా తమ తప్పిదాలను సవరించుకోవాల్సి ఉంది.

హార్దిక్ కెప్టెన్సీ మారాలి..
కెప్టెన్గా హార్దిక్ పాండ్యా తీసుకునే నిర్ణయాలు మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపుతున్నాయి. తానే ముందుగా బౌలింగ్ చేసి ఇతర బౌలర్లలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించడం అభినందనీయమే. కానీ, బౌలర్లను వినియోగించే తీరు సరిగా ఉండటం లేదనేది మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు.
తొలి టీ20లో దీపక్ హుడాతో, రెండో టీ20లో చాహల్తో పూర్తిగా బౌలింగ్ చేయించకపోవడం.. విమర్శలకు దారితీసింది.'మిషన్ -2024' కోసం ఇదంతా ప్రణాళిక బాగానే ఉంటుంది కానీ.. రెగ్యులర్ స్పిన్నర్ ఉన్నప్పుడు అతడినే వినియోగించుకొంటే బాగుంటుందనేది సీనియర్ల సూచన. కీలకమైన మ్యాచ్లోనైనా బ్యాటింగ్, బౌలింగ్ వనరులను సమర్థవంతంగా వాడుకోవాలని హార్దిక్కు విశ్లేషకులు సూచిస్తున్నారు.

టాపార్డర్ చెలరేగాల్సిందే..
టీ20 ఫార్మాట్లో టీమిండియా ఓపెనర్ల వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఆటగాళ్లను మార్చినా ఫలితం ఉండటం లేదు. ఓపెనర్లే కాదు టాపర్డర్ కూడా తడబడుతోంది. తొలి టీ20లో భారత ఓటమికి ప్రధాన కారణం టాపార్డర్ వైఫల్యమే. రెండో మ్యాచ్కు వచ్చేసరికి బౌలింగ్లో అదరగొట్టేసిన టీమిండియా.. ఛేదనలో చెమటోడ్చాల్సి వచ్చింది.
స్పిన్ బౌలింగ్కు పిచ్ అనుకూలంగా మారడంతో ఆచితూచి ఆడాల్సిన టాప్ ఆర్డర్ మళ్లీ తప్పటడుగులతో విఫలమైంది. సిరీస్ను తేల్చే మ్యాచ్లోనూ ఇలాంటి ప్రదర్శనే పునరావృతమైతే మాత్రం భారత్కు దెబ్బ తగలకమానదు. వచ్చిన అవకాశాలను శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్తోపాటు రాహుల్ త్రిపాఠి సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. వీరి స్థానాల్లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

పేసర్ల పేలవ ప్రదర్శన..
సిరీస్లోని రెండు మ్యాచుల్లో స్పిన్నర్లు రాణించారు. మరీ ముఖ్యంగా లక్నో పిచ్పై అయితే విజృంభించారు. కానీ, స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లోనూ పేసర్ శివమ్ మావి విఫలం కావడం, అలాగే తొలి మ్యాచ్లో అర్ష్దీప్ భారీగా పరుగులు సమర్పించడం భారత శిబిరంలో ఆందోళనకు గురి చేసే అంశం.
ఫాస్ట్ బౌలర్లు రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్లో నిలకడ లోపించింది. పేస్ బౌలింగ్ను సరిగ్గా సంధిస్తేనే ఫలితం అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లు ఎంత కష్టపడినా.. ఫాస్ట్ బౌలర్లు ప్రభావం చూపకపోతే సిరీస్ను కోల్పోయే ప్రమాదం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications