42 పరుగుల ఆధిక్యంలో..
ఆ తరువాత బౌలింగ్లోనూ అదే వైఫల్యాన్ని కొనసాగించింది. ప్రత్యర్థి చెలరేగిన పిచ్పైనే తుస్సుమన్నారు టీమిండియా బౌలర్లు. మ్యాచ్ ముగిసేంత వరకూ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. తొలి రోజే భారత జట్టుపై 42 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఓపెనర్లు రోరీ బర్న్స్ 52, హసీబ్ హమీద్ 60 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ టెస్ట్ సిరీస్లో వారిద్దరికీ ఇదే తొలి అర్థసెంచరీ.
మూడో టెస్ట్లో నిస్సారంగా..
నాటింగ్ హామ్, లార్డ్స్ టెస్ట్ మ్యాచుల్లో సత్తా చాటిన టీమిండియా.. హెడింగ్లేకు వచ్చే సరికి నీరుగారిపోయినట్టు కనిపించింది. ఒకరివెంట ఒకరు పెవిలియన్ దారి పట్టారు. తొలి ఓవర్ నుంచే భారత జట్టు పతనం ఆరంభమైంది. స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్, క్రెగ్ ఓవర్టన్, ఒల్లీ రాబిన్సన్, సామ్ కర్రమ్లకు అలవోకగా తలవంచింది. కనీసం పోరాడలేకపోయింది. అండర్సన్, ఓవర్టన్ మూడు, రాబిన్సన్ సామ్ కర్రమ్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు.
బౌలర్లూ విఫలం..
ఆ తరువాత బౌలింగ్లోనూ టీమిండియా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లు నిప్పుల్లాంటి బంతులను సంధించిన పిచ్ మీద మనవాళ్లు రాణించలేకపోయారు. ఒక్క బ్యాట్స్మెన్ను కూడా అవుట్ చేయలేకపోయారు. ఏ మాత్రం ఫామ్లో లేని రోరీ బర్న్స్, ఈ సిరీస్లో రెండో టెస్ట్ ఆడుతోన్న హసీబ్ హమీద్ అర్ధసెంచరీలను నమోదు చేశారు. 42 ఓవర్లను విసిరినప్పటికీ వికెట్ను తీసుకోలేకపోయారు. ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.
|
ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం..
ఈ టెస్ట్ సిరీస్లో తొలిసారిగా తమ జట్టు భారత్పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోండటం అటు స్టేడియంలో కూర్చున్న ఇంగ్లాండ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా వారు కట్టుతప్పారు. అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న హైదరాబాదీ మహ్మద్ సిరాజ్పై పింక్ కలర్ ప్లాస్టిక్ బాటిల్ను విసిరారు. అతనికి తగల్లేదు గానీ.. కాస్త పక్కకు వచ్చి పడిందా బాటిల్. అతన్ని ట్రోల్ చేస్తూ ఏవేవో సైగలు చేశారు.
|
పంచింగ్ ఫలక్నుమాకే పంచ్
మనోడసలే పంచింగ్ ఫలక్ నుమా టైప్. వారి ట్రోలింగ్ను లైట్గా తీసుకోలేదు. కౌంటర్ అటాక్ చేశాడు. తనను ట్రోలింగ్ చేస్తోన్న వారిపై కౌంటర్ వేశాడు. చేతివేళ్లతో ఒకటి అని, ఆ తరువాత సున్నా అని సైగలు చేశాడు. ఆ సైగలకు అర్థం.. అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు 1-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోండటం. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ ఫ్యాన్స్కు గుర్తు చేశాడు మహ్మద్ సిరాజ్. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.