లండన్: ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా శుక్రవారం నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగాల్సిన భారత్, ఇంగ్లండ్ చివరి టెస్టు అనూహ్యంగా రద్దయిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి భారత క్రికెటర్లందరి కోవిడ్ రిపోర్టులు నెగెటివ్గా వచ్చినా.. మ్యాచ్ మధ్యలో ఏదైనా జరగవచ్చనే భయమే టీమిండియా ఆటగాళ్లను బరిలోకి దిగకుండా చేసింది. సహజంగానే కరోనా ప్రభావం కొంత ఆలస్యంగా కనిపించే అవకాశం ఉంది కాబట్టి.. ఆడకపోవడమే మంచిదని కోహ్లీసేన భావించింది. మ్యాచ్ జరగాల్సిన రోజు ఉదయం సుదీర్ఘ సమయం పాటు చర్చించాక బీసీసీఐ, ఈసీబీ టెస్టును రద్దు చేయాలని నిర్ణయించాయి. అయితే టెస్ట్ సిరీస్ ఇలా ముగియడంపై ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ అసహనం వ్యక్తం చేశాడు. సిరీస్ ఇలా ముగియడం సిగ్గుచేటని పేర్కొన్నాడు.
తాజాగా స్వింగ్ మాస్టర్ జేమ్స్ అండర్సన్ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేసి భావేద్వేగం చెందాడు. ఈ వేసవి అంతర్జాతీయ క్రికెట్ ఇలా ముగియడం నిజంగా సిగ్గుచేటని, సీజన్ ఆఖరి మ్యాచ్ను ఆస్వాదించాలని భావించిన అభిమానులు తమను క్షమించాలని తన పోస్టులో జిమ్మీ రాసుకొచ్చాడు. సిరీస్ డిసైడర్ అయిన మాంచెస్టర్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్లు, హోటల్ గదులు బుక్ చేసుకున్న అభిమానులు తమను మన్నించాలని.. మిస్ అయిన మ్యాచ్ రీషెడ్యూల్ అవ్వాలని అశిద్దామని పేర్కొన్నాడు. తన హెంగ్రౌండ్ (ఓల్డ్ ట్రాఫర్డ్)లో మరో మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాని అండర్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.
ఇదు టెస్ట్ల ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతానికి రద్దైన ఐదో మ్యాచ్పై స్పష్టత లేకపోవడంతో సిరీస్ ఫలితం తేలాల్సి ఉంది. ఈ సిరీస్లో తొలి టెస్ట్ డ్రా కాగా.. రెండో మ్యాచ్ భారత్, మూడో టెస్ట్ ఇంగ్లండ్ గెలిచాయి. ఇక నాలుగో మ్యాచ్ టీమిండియా గెలిచి ఆధిక్యంలోకి వెళ్లింది. 4 టెస్ట్ మ్యాచ్ల్లో 24.67 సగటుతో 15 వికెట్లు పడగొట్టిన జేమ్స్ ఆండర్సన్.. ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 15 వికెట్లలలో జిమ్మీ ఓసారి 5 వికెట్ల ప్రదర్శన, మరోసారి 4 వికెట్ల ప్రదర్శన చేశాడు. అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్ ( 21) అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (18) రెండో స్థానంలో నిలిచాడు.
స్వింగ్ మాస్టర్ జేమ్స్ అండర్సన్కు భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీసే చివరిదని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఐదవ టెస్ట్ మ్యాచ్.. అండర్సన్ ఆడే చివరి మ్యాచ్ అని ఓ ఇంగ్లండ్ మాజీ కూడా పేర్కొన్నాడు. అయితే అండర్సన్ చేసిన పోస్ట్ పరిశీలిస్తే.. అతడు ఆటలో కొనసాగుతాడని తెలుస్తోంది. హెంగ్రౌండ్ (ఓల్డ్ ట్రాఫర్డ్)లో మరో మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాని జిమ్మీ అనడమే అందుకు కారణం. 39 ఏళ్ల జేమ్స్ అండర్సన్ ఇంగ్లండ్ తరఫున 166 టెస్ట్ మ్యాచుల్లో 632 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 7/42. 31 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. బ్యాట్తో 1249 రన్స్ చేశాడు. అత్యధిక స్కోర్ 81. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన అండర్సన్.. టెస్ట్ ఫార్మాట్ కొనసాగించేందుకు 2015 నుంచి పరిమిత ఓవర్లకు దూరమయ్యాడు. జిమ్మీ 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్ల కంటే.. టెస్టుల్లోనే జిమ్మీ సత్తాచాటి స్వింగ్ కింగ్గా పేరొందాడు.
జేమ్స్ అండర్సన్ ఇంగ్లీష్ గడ్డపై టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని ఇటీవలే అందుకున్నాడు. ఈ క్రమంలో సొంతగడ్డపై టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్గా అండర్సన్ నిలిచాడు. 94 టెస్టుల్లో అండర్సన్ ఈ ఘనత సాధించగా.. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్ మురళీధరన్ 73 టెస్టుల్లోనే 493 వికెట్లతో ఈ రికార్డ్లో టాప్లో ఉన్నాడు. ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జిమ్మీ (630) మూడో స్థానంలో ఉన్నాడు. టెస్ట్ ఫార్మాట్లో ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు తీసిన వారిలో ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ 708 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అనిల్ కుంబ్లే 619 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
సచిన్ టెండూల్కర్ ఆట నాపై తీవ్ర ప్రభావం చూపింది: ప్రమోద్ భగత్