
లండన్: ఇంగ్లాండ్తో జరుగుతున్న అయిదో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. తొలి రోజే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. 300లకు పైగా పరుగులను సాధించింది. ఓ టెస్ట్ మ్యాచ్లో తొలి రోజు స్కోర్ 300లను దాటడం అరుదు. దీన్ని అలవోకగా అందుకుంది టీమిండియా. మ్యాచ్పై పట్టు బిగించింది. ఇప్పటికే 2-1 తేడాతో ఆధిక్యతలో ఉన్న టీమిండియా ఖాతాలో మరో గెలుపు పడే అవకాశాలకు బీజం వేసింది.
ఈ క్రెడిట్ మొత్తం వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్-ఆల్రౌండర్ రవీంద్రజడేజా ద్వయానికి దక్కుతుంది. 200 పరుగుల చేయడం కూడా కష్టమనుకున్న దశలో క్రీజ్లోకి ఎంట్రీ ఇచ్చిన రిషభ్ పంత్- తనదైన శైలిలో రెచ్చిపోయాడు. వన్డే స్థాయిలో భారీ షాట్లు ఆడాడు. ప్రారంభంలో టెస్ట్ ఫార్మట్లో ఆడిన పంత్.. ఆ తరువాత గేర్ మార్చాడు. టాప్ గేర్లో దూసుకెళ్లాడు.
తొలి 45 బంతుల్లో 40 పరుగులు చేసిన రిషభ్ పంత్.. చివరి 66 బంతుల్లో 106 పరుగులు చేశాడంటే అతని దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 160.60 స్ట్రైక్ రేట్ను అందుకున్నాడు. అతనికి తోడుగా మరో ఎండ్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా క్రీజ్లో కుదురుకోవడంతో భారత్.. మ్యాచ్పై పట్టు బిగించింది. జట్టు స్కోరు 320 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆరో వికెట్గా రిషభ్ పంత్ వెనుదిరిగాడు. 19 ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లతో 146 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 83, మహ్మద్ షమీ-0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రిషభ్ పంత్ సెంచరీ పూర్తి చేసుకోవడం హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్లో ఉత్సాహాన్ని నింపింది. అతను సెంచరీ పూర్తి చేసుకోగానే డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ద్రావిడ్ సెలబ్రేట్ చేసుకున్నాడు. అతణ్ని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అవుట్ అయి డ్రెస్సింగ్ రూమ్కు చేరినప్పుడు కూడా ద్రావిడ్ అతని భుజాలపై తడుతూ అభినందనలు తెలిపాడు.
ఇంగ్లాండ్ గడ్డపై రిషభ్ పంత్కు ఓ అరుదైన రికార్డ్ ఉంది. టెస్ట్ మ్యాచ్లల్లో రెండు సెంచరీలు బాదిన తొలి ఆసియన్ వికెట్ కీపర్ అతనే. ఇప్పటివరకు టీమిండియాకు చెందిన ఏ వికెట్ కీపర్ కూడా ఇంగ్లాండ్లో రెండు టెస్ట్ సెంచరీలు చేయలేదు. అలాగే- పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్లు కూడా ఈ ఘనతను అందుకోలేదు.