లండన్: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తోన్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు లీడ్స్లోని హెడింగ్లే స్టేడియంలో రెండో రోజు తొలి సెషన్ ప్రారంభం కావాల్సి ఉంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు తొలి రోజు నాటి ఇన్నింగ్ను కొనసాగించాల్సి ఉంది. అదే సమయంలో- వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటోన్నాయి.
మూడో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు మొత్తాన్నీ ఇంగ్లాండ్ జట్టు క్రికెటర్లు డామినేట్ చేసిన విషయం తెలిసిందే. అన్ని సెషన్లనూ తమ చేతుల్లోకి తీసుకున్నారు. మ్యాచ్పై పట్టు బిగించారు. ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్నారు. హేమాహేమీల్లాంటి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చారు ఇంగ్లాండ్ బౌలర్లు. 78 పరుగులకే పరిమితం చేశారు. ఆ తరువాత తొలి ఇన్నింగ్ను ఆరంభించిన ఇంగ్లాండ్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. దూకుడును కనపరుస్తోన్నారు.
వికెట్ పడకుండా జాగ్రత్త పడుతున్నారు. రోరీ బర్న్స్ 52, హసీబ్ హమీద్ 60 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న టీమిండియాను వరుణ దేవుడు అండగా నిలిచే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం హెడింగ్లే స్టేడియం చుట్టూ దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఆకాశం మేఘావృతమై కనిపించింది. మొదట్లో సాధారణంగా కనిపించిన అక్కడి వాతావరణం- ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులు వీచడం మొదలైంది. చలిగాలుల తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రత పడిపోయింది.
వర్షం పడటానికి అధిక అవకాశాలు ఉన్నాయి. ముందుజాగ్రత్త చర్యగా హెడింగ్లే స్టేడియం గ్రౌండ్ స్టాఫ్.. పిచ్ను మూసి ఉంచారు. పిచ్ను మూసివేయడానికి కవర్లను తీసుకెళ్తోన్న ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3:30 గంటలకు రెండో రోజు ఆట మొదలు కావాల్సి ఉంది. వర్షం పడే సూచనలు ఉండటం, వెలుతురు లేమి వల్ల కొంత ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైనా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితి ఏర్పడింది.
క్షణక్షణానికీ మారే వాతావరణానికి మారుపేరుగా ఉన్న ఇంగ్లాండ్లో ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొంది. హెడింగ్లే స్టేడియం మీద కారుమబ్బులు కమ్ముకున్నాయి. వర్షం పడటానికి అవకాశం ఉంది. గ్రౌండ్ స్టాఫ్ ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నారు.
వర్షం పడకపోయినప్పటికీ.. వెలుతురు లేకపోవడం వల్ల మ్యాచ్ అనుకున్న సమయానికి మొదలు కాలేకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై మ్యాచ్ ఫీల్డ్ అంపైర్లు తమ తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
An overcast day at Headingley today. pic.twitter.com/LjtZTtHWtG
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 26, 2021
ఈ తరహా పరిస్థితులు బంతిని స్వింగ్ చేయడానికి మరింత దోహదపడతాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇది కొంత భారత్ బౌలర్లకు ఊరట కలిగించేదేనని అంటోన్నారు. బౌలర్లకు అనుకూల వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. మ్యాచ్ మొదలైతే.. టీమిండియా బౌలర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ రవీంద్ర జడేజా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లను కట్టడి చేయడానికే అధికార అవకాశాలు ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి.
గాలిలో తేమను వినియోగించుకుని ఇన్ స్వింగర్లు, అవుట్ స్వింగర్లతో బౌలర్లు చెలరేగుతారని, ఇది ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లను కొంత కలవరపాటుకు గురి చేసేదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారీ వర్షం, వెలుతురు లేకపోవడం వంటి కారణంగా రెండో రోజు మ్యాచ్ మొత్తానికీ తుడిచి పెట్టుకుని పోయినప్పటికీ.. అది టీమిండియా జట్టుకు ఊరట కలిగించే పరిణామంగానే భావిస్తోన్నారు స్పోర్ట్స్ అనలిస్టులు.