లండన్: భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ వెన్నెముక విరాట్ కోహ్లీ చాలాకాలంగా ఫామ్లో లేకపోవడం క్రికెట్ ప్రపంచంలో హాట్ డిబేట్గా మారింది. దీనిపై మాజీలు, సమకాలీన క్రికెటర్లు, కామెంటేటర్లు.. ఇలా క్రికెట్తో ముడిపడి ఉన్న సెలెబ్రిటీలు అందరూ ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని, అదే సమయంలో విచారాన్నీ వ్యక్తం చేస్తోన్నారు. ఇదివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో అంచనాలకు అనుగుణంగా రాణించలేదతను. ఆ తరువాత కూడా అదే పేలవమైన ఫామ్ను కొనసాగిస్తోన్నాడు.
ఇంగ్లాండ్ గడ్డపై ఆ దేశ జట్టుతో మూడు ఫార్మట్లలో మ్యాచ్ల్లోనూ విఫలం అయ్యాడు. టెస్ట్ మ్యాచ్ మొదలుకుని రెండో వన్డే వరకు ఒక్క భారీ ఇన్నింగ్ కూడా ఆడలేకపోయాడు. టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగుల్లో 11, 20 పరుగులు చేశాడు. రెండో టీ20లో 1, మూడో టీ20లో కోహ్లీ వాటా 11 పరుగులు మాత్రమే. గాయం కారణంగా తొలి మ్యాచ్కు దూరం అయ్యాడు. రెండో మ్యాచ్లో 25 బంతుల్లో మూడు ఫోర్లతో 16 పరుగులు చేశాడు.
అతని ఆటతీరు పట్ల పాకిస్తాన్ మాజీ ప్లేయర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్ సైతం ఆందోళన వ్యక్తం చేశాడు. కోహ్లీ ఇలా ఆడటాన్ని తాను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించాడు. ఫామ్తో పాటు ఆత్మవిశ్వాసాన్నీ కోల్పోయినట్లు కనిపిస్తోందని పేర్కొన్నాడు. అతనిలో పరుగుల ఆకలి మాత్రం తీరలేదని స్పష్టం చేశాడు. ఒక్కసారి ఫామ్లోకి వస్తే భారీగా పరుగులు చేస్తాడని, ఇదివరకటి కోహ్లీని చూడొచ్చని పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ మీద వస్తోన్న విమర్శలు చెలరేగడాన్ని తప్పుపట్టాడు. ఓ గొప్ప ప్లేయర్ మీద అలాంటి విమర్శలు చేయడం సరికాదని చెప్పాడు. ఇలాంటి గడ్డు స్థితిలో సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తాను విరాట్ కోహ్లికి సూచిస్తోన్నానని అన్నాడు. సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉండగలుగుతాడని వ్యాఖ్యానించాడు. తనపై వచ్చిన విమర్శలు, నెగెటివ్ కామెంట్స్ను కోహ్లీ స్వీకరించాలని, వాటిని తన విజయాలకు సోపానంగా మార్చుకోవాలని, తనలో ఉన్న ఫైర్కు ఇంధనంగా మార్చుకోవాలని అన్నాడు. సుదీర్ఘమైన క్రికెట్ ఆడే సత్తా ఇంకా కోహ్లీలో తగ్గలేదని పేర్కొన్నాడు.