
డర్హమ్: ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్కు ముందు కౌంటీ ఎలెవన్తో భారత్ వామప్ మ్యాచ్ ఆడుతోన్న విషయం తెలిసిందే. మంగళవారం ప్రారంభం అయిన మూడు రోజుల వామప్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేయగా.. కౌంటీ ఎలెవన్ తడబడుతోంది. బుధవారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కౌంటీ ఎలెవన్ రెండో రోజు భోజన విరామ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. క్రీజులో హసీబ్ హమీద్ (23), కెప్టెన్ విల్ రోడ్స్ (3) ఉన్నారు. భారత్ స్కోరుకు ఇంకా 267 పరుగులు వెనకబడి ఉంది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 9 వికెట్లకు 306 పరుగులు చేసిన భారత్.. రెండో రోజు మరో ఐదు పరుగులు చేసి ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ కేఎల్ రాహుల్ (150 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్తో 101 రిటైర్డ్ ఔట్) సెంచరీ చేయగా.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (146 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 75) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంబించిన కౌంటీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఉమేష్ యాదవ్ ఓపెనర్ లిబ్బి (12)ని పెవిలియన్ చేర్చాడు. రాబర్ట్ యేట్స్ (1) కూడా త్వరగానే ఔట్ అయ్యాడు.
అనంతరం క్రిజులోకి వచ్చిన టీమిండియా ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ (1) కూడా ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు. భారత పేసర్ మొహ్మద్ సిరాజ్ అతడిని ఔట్ చేశాడు. అంతకుముందు క్రీజులోకి వచ్చిన సుందర్తో సిరాజ్ గొడవపడ్డాడు. బాల్ వేశాక ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. ఆపై రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అతడు పెవిలియన్ చేరాడు. కెప్టెన్ విల్ రోడ్స్, హమీద్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఆశ్చర్యకరంగా భారత ఆటగాళ్లు ఆవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ కౌంటీ టీమ్ ఎలెవన్ తరఫున బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
ఈ సన్నాహక మ్యాచ్కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానేతో పాటు సీనియర్ బౌలర్ల మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ దూరంగా ఉన్నారు. దాంతో రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. సన్నాహక మ్యాచ్ ఆడని కోహ్లీ.. నెట్స్లో మాత్రం శ్రమిస్తున్నాడు. కొన్ని భారీ షాట్లతో అలరించాడు. జూలై 28 నుంచి రెండో వామప్ మ్యాచ్ జరగనుంది. అందులో విశ్రాంతి తీసుకున్న ప్లేయర్స్ ఆడే అవకాశం ఉంది. ఆగష్టు 4న భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆరంభం కానుంది.
