న్యూఢిల్లీ: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ 2022-23 ఫైనల్ బెర్తే లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియా ఆ దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరగనున్న నాలుగు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా విజయం సాధిస్తేనే ఫైనల్ బెర్త్ను దక్కించుకోనుంది. దాంతో ఈ సిరీస్ని సాధించి వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని భావిస్తోన్న బీసీసీఐ.. టెస్టు సిరీస్కు ముందు నాగ్పూర్లో టీమిండియాకు స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్ని నిర్వహించనుంది.
న్యూజిలాండ్ టీ20 సిరీస్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లతోపాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఫిబ్రవరి 2న నాగ్పూర్ చేరుకుంటారు. అక్కడ వరుసగా ఐదురోజులపాటు ట్రైనింగ్ సెషన్స్లో పాల్గొంటారు. అయితే, తొలి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చే విదర్భ క్రికెట్ అసోసియేసన్ (వీసీఏ) స్టేడియంలో రెండు సెషన్స్ మాత్రమే జరుగుతాయి. మిగతా మూడు సెషన్స్ని పాత వీసీఏ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఓ బీసీసీఐ అధికారి ఈ ప్రాక్టీస్ క్యాంప్కు సంబంధించిన వివరాలు తెలియజేశాడు.
'సిరీస్కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు టెస్టు ఆటగాళ్లు నాగ్పూర్లో కలువనున్నారు. అక్కడ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో వారికి ప్రాక్టీస్ క్యాంపు ఉంటుంది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ద్రవిడ్ జట్టుతో కలుస్తాడు. ఇది ఫిట్నెస్ క్యాంప్. కానీ, టెస్టు సిరీస్ ఆడటానికి ముందు ఎర్ర బంతితో ప్రాక్టీస్ చేయడానికి ఇది మంచి అవకాశంగా ఉపయోగపడుతుంది' అని సదరు అధికారి తెలిపాడు. ఫిబ్రవరి 9 నుంచి నాగ్పూర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభంకానుంది.
ఈ సిరీస్ కోసం మంగళవారమే ఆస్ట్రేలియా జట్టు భారత్కు బయలుదేరింది. ఆ జట్టు బెంగళూరు సమీపంలో ఆలూరులో ప్రాక్టీస్ క్యాంప్లో పాల్గొననుంది. ఈ సారి ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడమని చెప్పిన ఆస్ట్రేలియా నెట్ ప్రాక్టీస్కే పరిమితం కానుంది. ఆస్ట్రేలియా జట్టుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తోంది. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను చూసుకోనుంది. నేషనల్ క్రికెట్ అకాడమీ పర్యవేక్షణలోనే ఈ ప్రాక్టీస్ క్యాంప్ జరగనుందని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది.