హైదరాబాద్: రెండు నిమిషాలు మాత్రమే స్నానం చేయాలని కోహ్లీ సేనకు దక్షిణాఫ్రికా సూచించిందట. కేప్టౌన్లో నీటి సమస్య ఎక్కువగా ఉన్నందున టీమిండియా ఆటగాళ్లకు రెండు నిమిషాల కంటే ఎక్కువ సమయం స్నానం చేయొద్దంటూ అధికారులు విజ్ఞప్తి చేశారట.
దీంతో ఆటగాళ్లు ఎప్పుడు స్నానం చేసినా రెండు నిమిషాలలోపే వచ్చేయాల్సిన పరిస్థితి. ఈ విషయంపై ఓ ప్రైవేట్ మీడియా సంస్థ భారత్ ఆటగాడిని ప్రశ్నించింది. దానికి 'మేము మ్యాచ్లు ఆడేందుకు వచ్చాం. బాగా ఆడాలి. విజయాలు సాధించాలి. అంతే మిగతా వాటి గురించి పట్టించుకోవల్సిన అవసరం లేదు' అంటూ బదులిచ్చాడు.
మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే కేప్టౌన్లో ఈ సమయంలో నీటి సమస్య ఎక్కువగా ఉంటుందట. నీటి సమస్య కారణంగా పిచ్పై పచ్చికను పెంచే విషయంలోనూ సమస్య తలెత్తుతోందని గత వారం న్యూలాండ్స్ క్యూరేటర్ చెప్పిన సంగతి తెలిసిందే కదా.
ప్రజలు సైతం రోజుకు 87 లీటర్ల కన్నా ఎక్కవ నీటిని వినియోగించడానికి వీల్లేదని ఆదేశాలు కూడా ఉన్నాయి. పిచ్ను పేస్, బౌన్స్కు అనుకూలంగా తీర్చి దిద్దడం చాలా కష్టంగా మారిందని క్యూరేటర్ తెలిపాడు.
ప్రతి రోజూ ప్రాక్టీస్ అనంతరం ఆటగాళ్లు షవర్ల కింద కాసేపు సేద తీరేందుకు అవకాశం లేకపోయిందని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.
మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న కేప్ టౌన్ పిచ్ బౌన్సీ పిచ్ ఎంతమాత్రం కాదని క్యూరేటర్ స్పష్టం చేశాడు. నిజానికి తొలి టెస్టులో పేస్ బౌలింగ్తో భారత్ను బెంబేలెత్తించాలని భావిస్తున్న దక్షిణాఫ్రికాకు నిజంగా ఇది ఎదురుదెబ్బేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. దీంతో తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్మెన్ విజృభించి విజయంతో ఈ సిరిస్ను ఆరంభించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
వాండరర్స్, సెంచూరియన్ తరహాలో కేప్టౌన్ పిచ్ ముందు బౌలర్లకు అనుకూలించినప్పటికీ ఆ తర్వాత ఇబ్బందులు ఎదురుకావచ్చు అని ఫ్లింట్ పేర్కొన్నాడు. పిచ్పై పచ్చిక ఎక్కువగా ఉంటేనే బంతి స్వింగ్ అవుతుందని, అదనపు బౌన్స్ లభిస్తుందని చెప్పాడు. అదే నెర్రలు పడి, పొడిగా ఉంటే మాత్రం స్పిన్కు అనుకూలిస్తుందని అన్నాడు.
మూడు టెస్టు మ్యాచుల సిరీస్లో భాగంగా కేప్టౌన్లో శుక్రవారం మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా గత వారమే సఫారీ గడ్డపై అడుగుపెట్టింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.